Wednesday, May 1, 2024

ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారం తెలంగాణ : మంత్రి హ‌రీశ్ రావు

సిద్దిపేట : సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరులో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప‌ర్య‌టించారు. ఎన్నో ద‌శాబ్దాల క‌ల అయిన‌ పుల్లూరు గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ దేవాలయం నిజమైంది. గ్రామ ప్రజలందరికీ ఇవాళ పండుగ రోజు అని మంత్రి అన్నారు. పుల్లూరులో నూతన పోచమ్మ దేవాలయ విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ నాభి శిల బొడ్రాయి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాన్ని అనేక రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని మంత్రి చెప్పారు. పుల్లూరు గ్రామానికి డబుల్ లేన్ రోడ్డు – బైపాస్ రోడ్డు రావడంతో సరికొత్త అందమొచ్చిందని, రానున్న వారం రోజుల్లో రూ.2 కోట్ల వ్యయంతో గ్రామ ఎస్సీ కాలనీ నుంచి రామంచ వెళ్లే రహదారికి పనులు ప్రారంభం చేసుకుందామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేశ్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి – చందర్, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement