Saturday, April 27, 2024

గేమింగ్ కంపెనీల జీఎస్టీ ఎగవేత 22,936 కోట్లు.. ఎంపీ ‘లావు’ ప్రశ్నలకు కేంద్రం జవాబులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏప్రిల్ 2019 నుంచి నవంబర్ 2022 మధ్య గేమింగ్ కంపెనీల జీఎస్టీ ఎగవేత అంచనా ప్రకారం రూ. 22,936 కోట్లని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వైఎస్సాఆర్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మనీ లాండరింగ్‌కు గేమింగ్ కంపెనీలు మార్గంగా మారిన కేసుల వివరాలను అందించాలని కోరగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కింద రూ.289.28 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు వివరించారు. ప్రధాన మంత్రి కుషాల్ వికాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 1957 స్కిల్ హబ్‌ సెంటర్లలో 48 స్కిల్ హబ్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని సంబంధిత శాఖ మంత్రి తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్కిల్ హబ్‌ల ఏర్పాటుకు ప్రత్యేక నిధుల కేటాయింపులు లేవని చెప్పారు.

జన్యుపరంగా తయారుచేసిన కొన్ని పంటలకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారు, కొన్నిటిని ఎందుకు తిరస్కరిస్తున్నారన్న దానిపై కేంద్రం స్పష్టతనివ్వాలని ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. మార్పిడి పంటలను అనుమతించకపోవడం వల్ల ఇతర దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు నిలిపోతున్నాయని, కొన్ని పరిశ్రమలకు నష్టం వాటిల్లుతోందని లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఆవాల ఎగుమతికి ఆమోదం తెలిపినట్టే పౌల్ట్రీ, రొయ్యల వంటి పరిశ్రమలకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని పంటలను ఎందుకు అనుమతించట్లేదన్న దానిపై నిర్ధిష్టమైన మార్గదర్శకాలు లేవని కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement