Thursday, May 2, 2024

జి 20 – ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం

న్యూఢిల్లిd: జీ-20 చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జీ-20 శిఖరాగ్ర సదస్సు తొలిరోజైన శనివారంనాడు న్యూఢిల్లిd నేతల సదస్సు డిక్లరేషన్‌ సభ్యుల నుంచి నూటికి నూరు శాతం ఏకాభిప్రాయంతో ఆమోదం పొందింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేశారు. డిక్లరేషన్‌ ఆమోదం పొందడాన్ని చరిత్రాత్మకం, సరికొత్త పథ నిర్దేశంగా ప్రభుత్వం వర్ణించింది. ఇదే విషయమై ప్రధాని ప్రకటన చేస్తూ ”నాకు ఒక శుభవార్త అందింది. మా బృందం కఠోర శ్రమ కారణంగా న్యూఢిల్లిd జీ-20 నేతల సదస్సు డిక్లరేషన్‌ ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఈ నాయకత్వ డిక్లరేషన్‌ను స్వీకరించాల్సిందిగా నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ డిక్లరేషన్‌ స్వీకరణను నేను ప్రకటిస్తున్నాను. ఈ సందర్భంగా దీనిని సుసాధ్యం చేయడంలో కష్టించి పనిచేసిన నా షేర్పా, మంత్రులను అభినందిస్తున్నాను” అని అన్నారు. ”ఈ జీ-20 డిక్లరేషన్‌ ఆమోదం పొందాలనేది నా ప్రతిపాదన” అని డిక్లరేషన్‌ను స్వాగతిస్తున్నట్టుగా జీ-20 సభ్యులు వారి బల్లలు చరుస్తుండగా మోడీ అన్నారు. 38 పేరాలతో కూడిన న్యూఢిల్లిd డిక్లరేషన్‌ ”అభివృద్ధి, భౌగోళిక-రాజకీయాలకు చెందిన అన్ని అంశాలపై 100 శాతం ఏకాభిప్రాయం” తో ఆమోదం పొందిందని జీ-20కి భారత్‌ షేర్పా అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ”జీ-20 భారత్‌ నేతల సదస్సులో న్యూఢిల్లిd నేతల డిక్లరేషన్‌ అధికారికంగా ఆమోదం పొందింది. మానవ కేంద్రీకృత ప్రపంచకీరణ చరిత్రలో నేటి ఘట్టం సువర్ణాక్షరాలతో లిఖితమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత్‌ జీ-20 ప్రెసిడెన్సీ ఈ లక్ష్య సాధనకు అహరహం పనిచేసింది” అని కాంత్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.
డిక్లరేషన్‌ దృష్టి పెట్టిన 5 అంశాలు

  1. పటిష్టమైన, సుస్థిరమైన, సమతూకంతో కూడుకున్న సమ్మిళిత అభివృద్ధి
  2. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎస్‌డీజీలు)పై వేగవంతమైన పురోగతి
  3. సుస్థిర భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణకు ఒక ఒప్పందం
  4. 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు
  5. బహుపాక్షికతకు పునరుజ్జీవనం

అణ్వాయుధాల వినియోగం ఆమోదయోగ్యం కాదు – ఉక్రెయిన్‌ అంశంపై డిక్లరేషన్‌
అణ్వాయుధాల వినియోగం లేదా అణ్వాయుధాలను వినియోగిస్తామని బెదిరించడం ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ న్యూఢిల్లిd నేతల డిక్లరేషన్‌ పేర్కొంది. రష్యాను ప్రస్తావించకుండా బాలిలో ఆమోదించిన డిక్లరేషన్‌ను ప్రస్తావించింది. యూఎన్‌ చార్టర్‌ తాలూకు ఉద్దేశ్యాలు, సూత్రాలకు లోబడి అన్ని దేశాలు వ్యవహరించాలని పేర్కొంది. ఉక్రెయిన్‌లో ఒక పరిపూర్ణమైన, సహేతుకమైన, సుస్థిరమైన శాంతికి పిలుపునిచ్చింది. ”ఏదేనీ దేశం తాలూకు రాజకీయ స్వతంత్ర లేదా భూభాగ సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా భూభాగ దురాక్రమణ కోసం బల ప్రయోగం లేదా బల ప్రయోగం చేస్తామనే బెదిరింపునకు దూరంగా ఉండాలి” అని సభ్యదేశాలను అప్రమత్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement