Friday, May 3, 2024

పంజాబ్​ మాజీ సీఎం ప్రకాశ్​ సింగ్​ బాదల్​ ఇక లేరు..

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) మంగళవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రకాశ్ సింగ్ బాదల్.. వారం క్రితం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని పేర్కొనడంతో కుటుంబ సభ్యులు ఆయనను మొహలీలోని ఫోర్టిస్ దవాఖానలో చేర్చారు. దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. జాట్ సిక్కు కుటుంబానికి చెందిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 1927 డిసెంబర్ 8న మాలౌట్‌కు సమీపాన అబుల్ ఖురానాలో జన్మించారు. లాహోర్ లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పట్టా అందుకున్నారు.

వాజపేయి హయాంలో ఎన్డీఏకు మద్దతు

- Advertisement -

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బాదల్ సారధ్యంలోని అకాలీదళ్ మద్దతు తెలిపింది. నాటి నుంచి 2020లో కేంద్రం రైతులకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలు చేసే వరకు బీజేపీ, అకాలీదళ్ మధ్య కూటమి రాజకీయాలు సాగాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యంతో దవాఖానలో చేరిన సంగతి తెలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనను ఫోన్ లోనే పరామర్శించారు.

ఐదు సార్లు పంజాబ్ సీఎంగా సారథ్యం

అకాలీదళ్ పార్టీకి సారథ్యం వహించిన ప్రకాశ్ సింగ్ బాదల్ ఐదుసార్లు పంజాబ్ సీఎంగా పని చేశారు. రాష్ట్రానికి అతి పిన్న వయస్సులోనే సీఎంగా సారధ్యం వహించిన రికార్డు ప్రకాశ్ సింగ్ బాదల్ సొంతం. తొలిసారి 1970 నుంచి 1971, 1977 నుంచి 1980, 1997 నుంచి 2002, 2007 నుంచి 2017 వ‌ర‌కు పంజాబ్ సీఎంగా ప‌ని చేశారు. చివరిగా 2007 మార్చి ఒకటో తేదీ నుంచి 2017 మార్చి 16 వరకు సీఎంగా కొనసాగారు.

1947లోనే క్రియా శీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రకాశ్ సింగ్ బాదల్.. తొలుత బాదల్ గ్రామ సర్పంచ్‌గా, బ్లాక్ సమితి చైర్మన్ గా ఎన్నికయ్యారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫునే తొలిసారి 1957లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969లో తిరిగి అసెంబ్లీకి ఎన్నికైన బాదల్.. రాష్ట్ర పంచాయతీ రాజ్, పశు సంవర్ధక శాఖ మంత్రిగా పని చేశారు. పది సార్లు శాసనసభకు ఎన్నికైన బాదల్.. 1972, 1980, 2002లలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.అయితే, 1992 అసెంబ్లీ ఎన్నికలను అకాలీలు బహిష్కరించడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు ప్రకాశ్ సింగ్ బాదల్.

మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో వ్యవసాయ మంత్రిగా ప్రాతినిధ్యం

1997లో లాంబీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారి ఎన్నికైన బాదల్.. తర్వాత వరుసగా నాలుగు సార్లు ఆ స్థానం నుంచే శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీపై జనతా పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనతా పార్టీ నేత, నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ క్యాబినెట్‌లో ప్రకాశ్ సింగ్ బాదల్.. కేంద్ర వ్యవసాయ, నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు.

తొలిసారి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం

తొలిసారి 1970లో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశ్ సింగ్ బాదల్ బాధ్యతలు చేపట్టారు. పిన్న వయస్సులోనే దేశంలోనే ఒక రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన నేతగా నిలిచారు. తొలిసారి అకాలీదళ్-సంత్ ఫతే సింగ్-జన సంఘ్ కూటమి సర్కార్‌కు సారథ్యం వహించారు. పంజాబ్‌లో హిందీకి ప్రాతినిధ్యం వహించనందుకు 1970 జూన్‌లో బాదల్ ప్రభుత్వానికి జనసంఘ్ మద్దతు ఉపసంహరించుకున్నది. దీంతో అదే ఏడాది జూలై 24న విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం అసెంబ్లీ అత్యవసర సమావేశమైంది. అవిశ్వాస తీర్మానానికి ఐదో వంతు సభ్యుల మద్దతు లేకపోవడంతో ఆ తీర్మానం వీగిపోయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు.

1995-2008 వరకు అకాలీదళ్ పార్టీకి నాయకత్వం

శిరోమ‌ణి అకాలీద‌ళ్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఆయ‌న ఒక‌రు. 1995 నుంచి 2008 వ‌ర‌కు పార్టీ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. 2008లో ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ త‌న‌యుడు సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్.. అకాలీద‌ళ్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ క‌మిటీపై ప‌ట్టు సాధించిన నేత‌. 2015లో కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారంతో గౌర‌వించింది. 2020లో వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతుల ఆందోళనకు మద్దతుగా పద్మవిభూషణ్ అవార్డును కేంద్రానికి తిప్పి పంపారు.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం

1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పంజాబ్‌లో పోరాడిన రాజకీయ యోధుడు ప్రకాశ్ సింగ్ బాదల్. పౌర హక్కుల పరిరక్షణ కోసం పోరాడినందుకు ఆయనను అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం కింద అరెస్ట్ చేసి కర్నాల్ జైలుకు తరలించారు.

బాదల్‌ వ్యక్తిగత జీవితం ఇలా

ప్రకాశ్ సింగ్ బాదల్ 1979లో సురీందర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి కొడుకు సుఖ్ బీర్ సింగ్, కూతురు పర్ణీత్ సింగ్ కౌర్ ఉన్నారు. క్యాన్సర్‌తో సుదీర్ఘకాలం పోరాడిన సురీందర్ కౌర్ 2011లో మరణించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ సోదరుడు గురుదాస్ సింగ్ బాదల్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మేనల్లుడు మాన్ ప్రీత్ సింగ్ బాదల్.. పంజాబ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేశారు.

1996 నుంచి ఎన్డీఏలో భాగస్వామ్యం

1996లో తొలిసారి కేంద్రంలో నాటి బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో అకాలీదళ్ భాగస్వామిగా ఉన్నది. విపక్షాల నుంచి మద్దతు కొరవడడంతో 13 రోజులకే వాజపేయి సర్కార్ పతనమైంది. నాటి నుంచి 2020 వరకు ఎన్డీఏలో అకాలీదళ్ భాగస్వామిగా ఉన్నది. 2020లో కేంద్ర వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఎన్డీఏ నుంచి అకాలీదళ్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement