ప్రధానిగా మోడీ ఫెయిలయ్యారని, ఆయన పాలనపై దేశప్రజలు అసంతృప్తితో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రాజకీయ శిక్షణ తరగతలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మోడీ మొండిపాలనలో దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని ఆరోపించారు. జీవిత భీమా, రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఫోర్స్, చివరికి రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారని చాడా ఘాటుగా విమర్శించారు. ఒక వైపు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరో వైపు రైతు ధర్నాల పేరుతో దొంగ నటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో మాత్రమే కేంద్రంలోని మోడీ రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ లబ్ధి పొందే విధంగా కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ విధానాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఢిల్లీలో జరిగిన రైతు పోరాటమే ఇందుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాలని హితవు పలికారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ప్రజాపోరాటాలు మరింత ఉదృతం చేయాలని పీలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ శిబిరంలో సీపీఐ రాష్ట్ర నాయకులు మర్రి వెంకటస్వామి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, శిక్షణ ఉపాధ్యాయులు వేల్పుల నారాయణ, వివిధ జిల్లాల కార్యదర్శులు తాండ్ర సదానందం, ముడుపు ప్రభాకర్ రెడ్డి, రామడుగు లక్ష్మణ్, ఎస్. విలాస్, పోనగంటి కేదారి, గుంటి వేణు, రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, కె.కనక రాజ్, మద్దెల దినేష్,తాళ్లపెళ్లి లక్ష్మణ్, చంద్రగిరి ఉదయ్ కుమార్, ఆరెపల్లి మానస్ కుమార్, బాలసాని లెనిన్, ఈదునూరి ప్రేమ్ కుమార్, టి.రమేష్ కుమార్, శంకర్, అంజి, మేకల దాస్, కడారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..