Wednesday, May 8, 2024

AP | ఇంధన సామర్థ్య రంగం పెట్టుబడుల్లో ఏపీ ముందంజ

అమరావతి, ఆంధ్రప్రభ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎపీ దేశానికి మార్గనిర్దేశం చేస్తోంది. గత నాలుగేళ్లుగా అనేక రంగాల్లో పలు జాతీయస్థాయి అవార్డులను, గుర్తింపును దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్‌.. కేంద్రప్రభుత్వ నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే కేంద్ర విద్యుత్‌శాఖ ప్రవేశపెడుతున్న పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకం. దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా నూతన సాంకేతిక విధానాలను అవలంభించే పరిశ్రమలకు, అవి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలో కొంత రాయితీగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ సహకారంతో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి కేంద్ర విద్యుత్‌శాఖ ఈ పథకాన్ని తీసుకొస్తోంది.

ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇందులో రూ.6 వేల కోట్లను విద్యుత్‌ పొదుపు చర్యలను అమలు చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు కేటాయించింది. ఇటీవల హైదరాబాద్‌లో జాతీయ ఎనర్జీ ఎఫిషియెంట్‌ సమ్మిట్‌-2023 జరిగింది.. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల ఆధారంగానే ఈ పథకానికి కేంద్రం రూపకల్పన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంధన సామ్యర్థరంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

ఇదిలా వుండగా దేశంలోనే తొలి ఇన్వెస్ట్‌మెంట్‌ బజార్‌ను విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల్లో రూ.430 కోట్ల పెట్టుబడులను సాధించింది. ఏపీని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోను ఈ తరహా సదస్సులు నిర్వహించగా మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం విశేషం. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పారిశ్రామిక రంగానికి ప్రత్యేక వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి బీజం వేసింది. అలాగే ఏపీ ఇంధనశాఖ కూడా రెండేళ్ల కిందట వడ్డీ రాయితీ కోరుతూ ప్రతిపాదనల లేఖ రాసింది.

- Advertisement -

కాగా జి-20 సమ్మిట్‌లో ప్రపంచదేశాల నేతలు ఆశించిన నేపథ్యంలో దేశంలో 2050 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలనే లక్ష్యానికి ఈ పథకం దోహదపడనుంది. 2021-22లో బీఈఈ చర్యలతో 27.75 ఎంటీవోఈ ఇంధనం ఆదా అయింది. 130.21 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ పొదుపు చేయడం జరిగింది.. 175.22 మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగారు. అలాగే పెర్ఫార్మ్‌, అచీవ్‌ అండ్‌ ట్రేడ్‌ (పాట్‌) పథకం ద్వారా ఈ ఏడాది మార్చి నాటికే 13 రంగాల్లో సుమారు 26 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయడమేగాక 70 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడం జరిగింది. హైదరాబాద్‌ సమ్మిట్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) ఏపీలో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య చర్యలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై నివేదిక సమర్పించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement