Wednesday, May 22, 2024

త‌ప్పుడు మాట‌ల‌తో రెచ్చగొట్టొద్దు, రేవంత్ క్షమాపణ చెప్పాలి: కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అధిష్టానం ఏది ఆదేశిస్తే అది పాటిస్తానని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌పై స్పందించారు. తమది ఉమ్మడి కుటుంబమని చెప్పుకొచ్చిన ఆయన, ధర్నాలో తాను తప్ప ఎవరూ పాల్గొనలేదని తేల్చి చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ గురించి చులకనగా, తప్పుగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ నిజాయితీగా ఉన్నారని, 34 ఏళ్లుగా పార్టీ కోసం రక్తం ధార పోశానని గుర్తు చేశారు. తనను రెచ్చగొట్టవద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి రేవంత్ కాంగ్రెస్‌లో చేరిన విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆదరించకపోతే బ్రాందీ షాపులో పని చేయడానికి కూడా పనికి రారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  రేవంత్ కామెంట్స్‌పై ప్రజలు కూడా బాధ పడతారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కరడుగట్టిన కాంగ్రెస్ వాదినని, పార్టీ, నియోజక వర్గాల అభివృద్ధిలో తాను ముందున్నానని ఆయన చెప్పుకొచ్చారు. చాలా కుటుంబాల్లో వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement