Friday, May 3, 2024

రోగుల ఆరోగ్యాన్ని న‌యం చేయ‌గ‌ల శ‌క్తి వైద్యుల‌కే ఉంది: హరీశ్‌ రావు

రోగుల ఆరోగ్యాన్ని నయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంద‌ని, వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాల‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో మరో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ చేపట్టామని, 1,331 మంది ఆయుష్‌ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయన్నారు. కొత్తగా ఎంపికైన 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హరీశ్‌ నియామకపత్రాలు అందజేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్యశాఖలో ఉద్యోగాలిచ్చామ‌ని, మరో 9,222 పోస్ట్‌లకు రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామ‌న్నారు. వచ్చే నెల నుంచి టి డియాగ్నస్టిక్స్‌లో 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామ‌ని, ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయ‌ని గుర్తు చేశారు. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement