Friday, May 3, 2024

డెక్కన్‌ మాల్‌ కూల్చివేత షురూ.. ఆఖరు అంతస్తు నుంచి మొదలు..

సికింద్రాబాద్ మినిస్టర్‌ రోడ్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన డెక్కన్‌ మాల్‌ బిల్డింగ్‌ కూల్చివేత ప‌నులు గురువారం రాత్రి నుంచి ప్రారంభం అయ్యాయి. చుట్టు పక్కల బిల్డింగ్‌లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా హైడ్రాలిక్‌ క్రషర్‌ డిమాలిషన్‌ విధానంలో ఈ బిల్డింగ్‌ను కూల్చిత ప‌నులు చేప‌ట్టారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఫైర్‌, పోలీస్‌ అధికారులు సంయుక్తంగా ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు. చుట్టు పక్కల ఉన్న బస్తీ ఇండ్లకు, వ్యాపార సంస్థలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రాలిక్‌ క్రషర్‌ డిమాలిషన్‌ విధానంలో ఈ భవనాన్ని కూల్చివేయనున్నారు. భవనం ఒక వైపు ఒరిగిపోకుండా, మరో భవనంపై పడకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కూల్చివేత పనులు చేపట్టారు. కాగా ఈ భవనం కూల్చివేతకు కాంట్రాక్ట్‌ మొదట దక్కించుకున్న ఎస్కే మల్లు ఏజెన్సీ దగ్గర సరైన మిషనరీ లేకపోవడంతో అధికారులు వారిని తప్పించి మాలిక్‌ ట్రేడింగ్‌ అండ్‌ డిమాలిషన్‌ (కృష్ణ ప్రసాద్‌ ఏజెన్సీ) కంపెనీకి కాంట్రాక్ట్‌ అప్పగించారు. దీంతో గురువారం రాత్రి హైరిచ్‌ కాంబి క్రషర్‌ అనే అధునాతన యంత్రాన్ని భవనం వద్దకు తీసుకువచ్చి రాత్రి డిమాలిషన్‌ పనులు ప్రారంభించారు. కాగా ఈ భవనం ఆరో అంతస్తు నుంచి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. కూల్చివేత కోసం జపాన్‌కు చెందిన హైరిచ్‌ కాంబి క్రషర్‌ మిషన్‌ను వాడుతున్నారు. భవనం పిల్లర్స్‌, కాలమ్స్‌ను మిషన్‌తో కట్‌ చేసి భవనాన్ని కూల్చివేయనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 10 శాతం కూల్చివేత ప‌నులు పూర్తి అయిన‌ట్లు వారు తెలిపారు. డెక్క‌న్ మాల్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement