Tuesday, May 21, 2024

Delhi | హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్.. ఎంపీ రంజిత్ రెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో శుక్రవారం లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా (ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ఏ పర్మనెంట్ బెంచ్ ఎట్ హైదరాబాద్) యాక్ట్ 2023 పేరుతో ఈ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరి, దాద్రా నాగర్ హవేలి, అండమాన్ నికోబార్ దీవులు ఈ బెంచ్ పరిధిలోకి వచ్చేలా హైదరాబాద్ కేంద్రంగా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బిల్లులో ఆయన ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 130 కూడా సుప్రీంకోర్టును ఢిల్లీ లేదా దేశంలో మరెక్కడైనా ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు.

సుప్రీంకోర్టులో ప్రస్తుతం 70 వేల కేసులు పెండింగులో ఉన్నాయని, కోర్టులో జడ్జిల సంఖ్య 33 మాత్రమే ఉందని, ఈ లెక్కన ప్రతి జడ్జి సుమారు 6 వేల కేసులను పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. 10వ లా కమిషన్ 95వ నివేదికలో సైతం ఢిల్లీలో ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌తో పాటు దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. 11వ లా కమిషన్ కూడా ఈ అంశాన్ని పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. 18వ లా కమిషన్ సిఫార్సుల్లోనూ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఢిల్లీలో ఉంచి మిగతా దేశంలోని నాలుగు దిక్కులా బెంచ్‌లు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినట్టు తన ప్రైవేట్ బిల్లులో రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సిఫార్సుల్లో దక్షిణాదిన హైదరాబాద్ లేదా చెన్నైలో బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించినట్టు గుర్తుచేశారు.

- Advertisement -

ఈ సిఫార్సుల వెనుక కారణం సుదూర ప్రాంతాల నుంచి సుప్రీంకోర్టు వరకు కక్షిదారులు చేరుకోలేకపోవడమేనని రంజిత్ రెడ్డి తెలిపారు. చాలా కేసుల్లో కక్షిదారులు హైకోర్టు దశలోనే ఆగిపోతున్నారని, ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నవారిలో ఢిల్లీకి సమీపంలో ఉన్న పంజాబ్, హర్యా, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల కేసులే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో బెంచ్ ఏర్పాటు చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలవారికి సౌలభ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

అనుకూలమైన నగరం హైదరాబాద్

హైదరాబాద్ నగరం దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటని, అన్ని మూలల నుంచి హైదరాబాద్ చేరుకోడానికి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ హబ్‌గా ఉన్న హైదరాబాద్ నగరంలో అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం అత్యంత అనువైనదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement