Wednesday, May 1, 2024

Delhi | బాబు, లోకేశ్ భద్రతపై హోంశాఖ ఆరా.. ఏపీ డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్ భద్రతపై కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. గత ఏడాది నవంబర్ 4న కృష్ణా జిల్లా నందిగామలో చంద్రబాబు నిర్వహించిన ర్యాలీలో జరిగిన రాళ్ల దాడి ఘటనను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కలిగిన నేత అని, ఆయనతో పాటు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కు సైతం భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కనకమేడల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని ఈ నేతలిద్దరికీ తగిన భద్రత కల్పించాలని కోరారు. కనకమేడల లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇద్దరు నేతలకు కల్పిస్తున్న భద్రత వివరాలను తెలియజేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement