Sunday, April 28, 2024

Delhi: ఈనెల‌ 15 వ‌ర‌కు రిమాండ్.. తిహార్ జైలుకు కేజ్రీవాల్

ముఖ్య‌మంత్రి హోదాలో జైలుకు
చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి
ఢిల్లీ సిఎంకు జ్యుడిషియ‌ల్ రిమాండ్
15వ తేది వ‌ర‌కూ తిహార్ జైలులోనే
విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డంలేద‌న్న ఈడీ
మ‌ళ్లీ క‌స్టడీకి తీసుకుంటామంటూ కోర్టుకు విన‌తి

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో, ఆయనను ఈరోజు కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. తొలుత ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. సోమవారంతో ఆ కస్టడీ ముగియడంతో సీఎంను నేడు కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు.. ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదని తెలిపారు. ఆయనను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోరారు.

విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదు ..

”విచారణకు సీఎం సహకరించడం లేదు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డ్‌లను చెప్పడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆయనను మళ్లీ కస్టడీలోకి తీసుకుంటాం. అప్పటిదాకా జ్యుడిషియల్‌ కస్టడీ విధించాలి” అని ఈడీ వాదించింది. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది.

- Advertisement -

మోదీపై కేజ్రీవాల్ ఘాటు విమ‌ర్శ‌లు
కోర్టు లోపలికి వెళ్లే ముందు కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ”ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదు” అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్‌ నేతలు మనీశ్‌ సిసోదియా, సంజయ్‌ సింగ్‌, భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టై తిహార్ జైలులో ఉన్నారు..

మూడు పుస్త‌కాల‌కు అనుమ‌తివ్వండి..

అర‌వింద్ కేజ్రీవాల్ న్యాయ‌వాదులు కోర్టులో ప్ర‌త్యేక అప్లికేష‌న్ దాఖ‌లు చేశారు. మూడు పుస్త‌కాలు చ‌దువుకునేందుకు కేజ్రీవాల్‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని న్యాయ‌వాదులు కోరారు. భ‌గ‌వ‌ద్గీత, రామాయ‌ణం, హౌ ప్రైమ్ మినిస్ట‌ర్స్ డిసైడ్ అన్న పుస్త‌కాలు కేజ్రీవాల్ చ‌దువుకుంటార‌ని ఆయ‌న త‌ర‌పున న్యాయ‌వాదులు కోర్టులో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement