Monday, May 6, 2024

క్రూడాయిల్‌ సెంచరీ, ఏడేళ్ల గరిష్టానికి ధరలు.. 100 డాలర్లు దాటిన ముడిచమురు

అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్‌ ధర మంగళవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. సుమారు 100 డాలర్లు పలుకుతున్నది. 2014 సెప్టెంబర్‌ తరువాత ఇదే అత్యధికం. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే.. క్రూడాయిల్‌ ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా అణిచివేత పెరుగుతున్నది. యూరప్‌, రష్యా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత దిగజారిపోతాయనే భయంతో ముడి చమురు ధరలు పెరగడానికి దారితీస్తోందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆర్మీ అడుగుపెట్టినట్టు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన నేపథ్యంలో.. క్రూడాయిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో భారత్‌లో ఎన్నికలు ముగిసిన తరువాత.. ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

నెలలో 12శాతం పెరుగుదల..

మంగళవారం ట్రేడింగ్‌లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు బ్యారెల్‌కు 96.48 డాలర్ల నుంచి సుమారు 100 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్‌ ఒక నెలలో దాదాపు 12 శాతం లాభపడింది. అదే సమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 95.43 డాలర్లకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగాయి. భారత్‌లో రిటైల్‌ అమ్మకాలపై కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. దీపావళి తరువాత దేశంలో పెట్రోల్‌, డీజెల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరికొన్ని రోజుల్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 125 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ బెంచ్‌ మార్క్‌ అయిన బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర సుమారు 4 డాలర్లు పెరిగి.. 100 డాలర్లకు చేరువైంది. 2014 సెప్టెంబర్‌ తరువాత ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.

పెరిగిన పెట్రో, డీజెల్‌ డిమాండ్‌..

యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడ్‌ ఆయిల్‌ ధర 5 డాలర్ల వరకు పెరిగి.. 96 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రత తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్రోల్‌, డీజెల్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణంతో చమురు ధరలు ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి క్టిష్ట పరిస్థితుల్లో ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌ పోర్టింగ్‌ దేశలు, ఒపెక్‌ ప్లస్‌గా పిలవబడే మిత్ర దేశాలు చమురు సరఫరాను ఎక్కువ పెంచడానికి ఆలోచిస్తున్నాయి.

- Advertisement -

భారత్‌లో రూ.8-9 పెంపు!

భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లిd ఎన్నికలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలు పెంచేందుకు సాహసించడం లేదని తెలుస్తున్నది. ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలు పెంచేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. లీటర్‌కు రూ.8 నుంచి రూ.9 వరకు (11-12 సెంట్లు) పెంచాలని యోచిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడం.. అటు కేంద్రానికి, ఇటు సెంట్రల్‌ బ్యాంక్‌కు ఇబ్బందే. చమురు ధరలు పెరిగితే.. నిత్యవసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. దీంతో మళ్లిd ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. దీంతో ద్రవ్యోల్బణం కట్టడి చేయడం ఆర్‌బీఐకి మరింత కష్టంగా మారుతుంది. చమురు ధరలో ప్రతీ 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధి 0.3 శాతం నుంచి 0.35 శాతానికి తగ్గనున్నట్టు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement