Monday, April 29, 2024

‘జగనన్న వసతి దీవెన’ తొలి విడత నిధులు విడుదల

2020-21 ఏడాదికి జగనన్న వసతి దీవెన తొలి విడత నిధులను సీఎం జగన్ బుధవారం విడుదల చేశారు. ఏపీలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థుల హాస్టల్ ఫీజులను జగనన్న వసతి దీవెన పేరిట వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10.89 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,048.94 కోట్ల నగదు జమ చేసినట్టు సీఎం జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదన్నదే తమ అభిమతం అని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు రూ.20 వేలు వసతి దీవెన రూపంలో అందిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు. తల్లుల ఖాతాలో వేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని, తల్లులే నేరుగా ఫీజు కట్టడం వల్ల కాలేజీల యాజమాన్యాల్లో జవాబుదారీ తనం వస్తుందని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జగన్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement