Tuesday, May 21, 2024

National | దసరా వేళ కేంద్ర కేబినెట్‌ తీపికబురు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4శాతం డీఏ పెంపు

దసరా పండగ వేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎను 4శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా రైల్వే ఉద్యోగులకు, గోధుమ సాగుచేసే రైతులకు శుభవార్త అందించింది. ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్సును (డిఎ) 4 శాతం పెంచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం ఇస్తున్న డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగనుంది. జులై 1నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపు నిర్ణయంతో 48.67 లక్షల మంది ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. చివరగా ఈ ఏడాది మార్చిలో నాలుగు శాతం డీఏను పెంచిన సంగతి తెలిసిందే.

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌..
రైల్వే ఉద్యోగులకు ఏటా ఇచ్చే ఉత్పతాదకత ఆధారిత బోనస్‌కు సైతం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్‌గా చెల్లించనున్నారు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మినహా ట్రాక్‌ మెయింటెనర్లు, లోకో పైలెట్లు, ట్రెయిన్‌ మేనేజర్లు, స్టేషన్‌ మాస్టర్లు, సూపర్‌ వైజర్లు, టెక్నీషియన్లు.. ఇలా అర్హులైన 11.07 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందు కోసం రూ.1968.87 కోట్లు వెచ్చించనున్నారు.

- Advertisement -

గోధుమ రైతుకు మద్దతు
గోధుమలు అధికంగా పండించే రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగున్న వేళ మద్దతు ధరను కేంద్రం భారీగా పెంచింది. 2024-25 మార్కెటింగ్‌ సీజన్‌కు గానూ క్వింటాల్‌కు రూ.150 చొప్పున పెంచి రూ.2,275గా నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో గోధుమలకు మద్దతు ధర ప్రకటించడం ఇదే తొలిసారి. భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ) సిఫార్సులకు అనుగుణంగా రబీ సీజన్‌కు సంబంధించి ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ప్రస్తుతం గోధుమలకు కనీస మద్దతు ధర రూ.2,215గా ఉంది. అలాగే బార్లీపై రూ.115 (రూ.1850), శెనగపై రూ.105 (రూ.5440), కందులుపై రూ.425 (రూ.6425), ఆవాలుపై రూ.200 (రూ.5650), సన్‌ప్లnవర్‌పై రూ.150 (రూ.5,800) పెంపును ప్రకటించి కొత్త మద్దతు ధరలను నిర్ధారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement