Monday, April 29, 2024

Delhi | పోలవరంపై కేంద్రం మరో వరం.. తాగునీటి ఖర్చు భరించేందుకు సిద్ధం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టులో సాగునీటి ప్రాజెక్టు కోసం అయ్యే ఖర్చును మాత్రమే భరిస్తానని చెప్పిన కేంద్రం ఎట్టకేలకు మనసు మార్చుకుంది. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో తాగునీటి ప్రాజెక్టు ఖర్చును సైతం భరించేందుకు అంగీకారం తెలుపింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగు నీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని, తాగు నీటి విభాగం కోసం చేసే ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ కేంద్రం ఇన్నాళ్ళుగా మొండికేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తులను ఎట్టకేలకు పరిగణలోకి తీసుకుని తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది.

రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించిన రూ. 55,548 కోట్ల నిధుల గురించి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి రూ. 10,911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మరమ్మతు పనుల నిమిత్తం అదనంగా మరో రూ. 2 వేల కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. అలాగే తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆ విభాగం ఎలాంటి అభ్యంతరం లేదని తమకు సమాచారం ఇచ్చిందని మంత్రి చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇప్పటి వరకు కాంపోనెంట్‌ వారీగా జరిగిన పనులకు కేంద్రం నిధులు చెల్లిస్తూ వస్తోంది. కాంపోనెంట్‌ వారీగా నిధుల చెల్లింపు వలన ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దృష్టికి తీసుకువచ్చి కాంపోనెంట్‌ వారీ చెల్లింపులపై సీలింగ్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపోనెంట్‌ వారీ సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్‌ 5న తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement