Sunday, May 5, 2024

Breaking : చెక్ బౌన్స్ కేసు..వారియ‌ర్ డైరెక్ట‌ర్ కి ఆరు నెల‌ల జైలు శిక్ష‌

త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్నారు. దాంతో ఆయ‌న‌కి కోర్టు ఆరు నెల‌లు జైలు శిక్ష విధించింది. 2014లో పీవీపీ సంస్థ నుంచి లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్‌ రూ. కోటికి పైగా రుణం తీసుకున్నారు. వీరు తిరుపతి బ్రదర్స్ పేరుతో నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. అయితే అప్పు తిరిగి చెల్లించేందుకు సంబంధించి వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో గతేడాది పీవీపీ సంస్థ వారిపై చెక్ బౌన్స్ కేసు పెట్టింది. కేసును విచారించిన చెన్నై సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. దర్శకుడు లింగుస్వామికి చెక్ ఫ్రాడ్ కేసులో 6 నెలల జైలు శిక్ష విధించింది.

గతేడాది ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై లింగుస్వామి అప్పీల్‌ దాఖలు చేశారు. తాజాగా విచారణ జరిపిన మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు.. కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఈ జడ్జిమెంట్ గురించి ట్విట్టర్‌లో షేర్ చేసిన లింగుస్వామి.. మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్లలో లింగుస్వామి ఒకరు. ఆయన తీసిన సినిమాల్లో రన్, పందెంకోడి, ఆవారా చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి. నిజానికి లింగుసామి నిర్మాణంలో రూపొందిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచాయి. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. తెలుగులో రామ్ పోతినేనితో చేసిన ‘వారియర్’ అతని చివరి చిత్రం కాగా.. వాణిజ్య పరంగానే కాక కంటెంట్ పరంగానూ పరాజయం పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement