Sunday, May 19, 2024

బీజేపీ మిషన్ 2024: 2019లో ఓడిన సీట్లపై ఫోకస్.. గెలుపు వ్యూహాలపై కీలక భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో బీజేపీ ఓడిపోయిన 144 పార్లమెంట్ నియోజకవర్గాలపై ఈ భేటీలో సమీక్ష నిర్వహించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వీటిలో చాలా చోట్ల బీజేపీ ద్వితీయ స్థానంలో నిలవగా, కొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొని కొద్ది తేడాతో తృతీయస్థానంలో నిలిచిన స్థానాలు కూడా ఉన్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ నియోజకవర్గాల్లో కూడా గెలుపొందేలా వ్యూహాలు రచిస్తే.. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. 2019లో గెలుపొందిన నియోజకవర్గాల్లో అభ్యర్థిపై వ్యతిరేకత తదితర కారణాలతో కొన్నింటిని కోల్పోయినా.. ఈ 144 స్థానాల్లో గెలుపొందేవాటితో భర్తీ చేసుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్ది తేడాతో ఓటమిపాలవ్వడానికి గల కారణాలపై మంత్రుల బృందం ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి ఇప్పటికే నివేదికలు అందజేసినట్టు సమాచారం.

లోపాలు, బలహీనతలు, వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, మార్పుచేర్పులు, స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారని, మంగళవారం నాటి సమావేశం ప్రధానంగా వీటిపైనే సమీక్ష జరిపిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవడం కోసం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement