Monday, April 29, 2024

దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న బీజేపీ : సీపీఐ నేత కూనంనేని

హనుమకొండ : దేశంలో బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కన్నా మత ఉన్మాదాన్ని బీజేపీ పెంచుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. గురువారం హనుమకొండ బాల సముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి బీజేపీకి లేదని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రాష్ట్రంలో వివిధ పట్టణాలకు ఉన్న పేర్లను మారుస్తామని అంటున్నారని, ఆ పేర్ల వెనక ఎంతో చారిత్రాత్మకమైన నేపథ్యం ఆ ప్రాంత ప్రజల జీవన విధానం, సంస్కృతి మీద ఆధారపడి ఏర్పడినటువంటిదేనని, పట్టణాల పేర్లు వాటిని మారుస్తామనడం మూర్ఖత్వం అన్నారు. బండి సంజయ్, అమిత్ షా పేర్లు మారుస్తారా..వాళ్ళ అమ్మానాన్న పెట్టిన పేరును కూడా బండి సంజయ్ మార్చుకుంటాడా అని ప్రశ్నించారు. తెలుగు భాషా సంస్కృతి ప్రతిపాదికన ఏర్పడిన పేర్లే పట్టణాలకు పెట్టారని అన్నారు. గోద్రా మరణ హోమానికి గురైన బిల్కిస్ భానో వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేయడం జరిగిందని, ఆ మారణ హోమంలో ఆమె తన సర్వస్వాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నతమైన న్యాయస్థానం కూడా అలాంటి విషయాన్ని పట్టించుకోకుండా పిటిషన్ కొట్టివేయడం మూలంగా న్యాయం జరగకుండా పోయే పరిస్థితులు కనబడుతున్నాయని, న్యాయ వ్యవస్థను కూడా బిజెపి తన అధికార బలంతో కంట్రోల్ చేస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి కన్నా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి, దేశ ప్రజల మధ్య విభజన గీత గీసి తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మారంగా చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, బిఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్, రక్షణ రంగం, రైల్వే, విమానయాన, విద్యుత్ సంస్కరణల వంటి చర్యల ద్వారా కేవలం నాలుగు లక్షల కోట్ల కోసం ఆదాని, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందని అన్నారు. ఉచిత పథకాలను రద్దు చేద్దామనడం, పేదలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనని, ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బడా పెట్టుబడిదారులకు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల బకాయిలు రద్దు చేసి ఆదాని, అంబానీలకు దేశ సంపదను కట్టబెట్టిందని అన్నారు. ఈ దేశానికి బిజెపి ప్రమాదకారిగా మారిందని అన్నారు.కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి గానీ పట్టణాల అభివృద్ధికి గానీ కృషి చేయకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడం కొరకు మాత్రమే బండి తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విభజన హామీలైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను బిజెపి మోసం చేస్తుందని అన్నారు. జీఎస్టీ పన్నుల వాటా 30 కోట్లు తెలంగాణకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆపిందని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఈడి, సిబిఐ పేరుతో దాడులు చేస్తూ ప్రజా ప్రతినిధుల పైన మానసిక దాడులకు సిద్ధమైందన్నారు. రైతుల, కార్మికుల, విద్యార్థి యువజన , పేదల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు నిరంతరం కొనసాగుతాయని అయినా అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాలంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించిన చరిత్ర గతంలో మనం చూశామని, తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలం ఇవ్వకుండా ఇండ్లు కట్టుకోవడం కొరకు మూడు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల స్థలాల కొరకు పోరాటాలు చేస్తున్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్న పేదలకు ఆ స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడం కొరకు ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో , ఫామ్ హౌస్ లుగా వందలాది ఎకరాలు మారుతున్నాయని ఆయన అన్నారు. పేదలకు ఇండ్ల స్థలాల కోసం ఢిల్లీలో కూడా ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు టి.వెంకట్రాములు,జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి,మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మారుపాక అనిల్ కుమార్, మండ సదా లక్ష్మి, జక్కు రాజు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement