వందే భారత్ ట్రైన్ ను భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఎక్కవ డిస్టెన్స్ తక్కువ టైమ్ లో చేరుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ రైలును తయారు చేశారు. ఇప్పటికే పలు దేశాలు ఎంతటి దూరాన్నైనా గంటల వ్యవధిలో చేరుకునేలా అక్కడి రైళ్లను రూపొందించుకుంటున్నారు. అదేతరహాలో భారత్ లో కూడా ఎక్కవ దూరాన్ని సైతం గంటల వ్యవధిలోనే చేరుకునేందుకు కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించింది. గంటకు 150 కి.మీ వేగంతో ఈ రైలు ప్రయాణం సాగనుంది. కొన్ని రూట్లలో ట్రాక్ సామర్ధ్యాన్ని బట్టి 130 కి.మి వేగంతో నడిపిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్ పై 150 కి.మీ వేగంతో దూసుకెళ్తోంది. సాధ్యమైనంత వరకు ఎక్కవ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునే విధంగా రూట్ మ్యాప్ ను కూడా ఇండియన్ రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇది విజయవంతం అయితే ప్రయాణ సమయం మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు సర్వేలు చేసి ఆయా రూట్లలో వందే భారత్ రైలును నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు పలు రూట్లలో సర్వేలు చేసింది. మొత్తం నాలుగు రూట్లలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే మార్గాలు ఉండగా.. ఇందులో ఏ రూట్లో నడుపుతారన్న దానిపై ఇండియల్ రైల్వే క్లారిటీ ఇచ్చినట్లు ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలును బీబీనగర్- నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. మొదట వరంగల్- కాజీపేట మార్గంలో నడపాలని అనుకున్నా.. ఎక్కువ దూరం అవుతున్నందున ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీబీనగర్ నుంచి గుంటూరు వరకు ప్రస్తుతం ఉన్న రైలు మార్గంలో కట్టలను అధికారులు మరమ్మతులు చేసి పటిష్టం చేశారు. 130 కి.మీ. వేగం వరకు ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ఈ మార్గం వందేభారత్ రైలు వేగానికి అనుకూలంగా ఉండడం.. దూరం తక్కువగా ఉండడంతో.. దీన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది.
డిస్టెన్స్ తగ్గించేందుకు రూట్ మ్యాప్…
ఇండియన్ రైల్వే అధికారులు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు కి.మీ డిస్టెన్స్ తగ్గించేలా రూట్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రూట్లను పరిశీలించగా.. 150 కి.మీ తగ్గినట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రయాణ సమయం మరింత తగ్గి ప్రయాణికులకు మంచి సేవలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రూట్లను ఎంపిక చేశారు. వందే భారత్ రైలును మాత్రం పిడుగురాళ్ల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూపిడుగురాళ్ల జంక్షన్ నుంచి డైవర్ట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. పిడుగురాళ్ల నుంచి శావల్యపురం మీదుగా నేరుగా ఒంగోలు వరకు నడుపుతారు. అక్కడి నుంచి సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి వెళ్తుంది. ఐతే ప్రస్తుతం శావల్యపురం ఒంగోలు మార్గం వరకు రెండు లైన్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తి అయితే సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. అందువల్ల ఈ రూట్కే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ రూట్ లో వందేభారత్ కు ఆదరణ పెరిగే ఛాన్స్…
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ ను నడుపుతున్నారు. ఈ రైలు సికింద్రాబాద్- బీబీనగర్- నల్గొండ- మిర్యాలగూడ- నడికుడి- పిడుగురాళ్ల- సత్తెనపల్లి- గుంటూరు- తెనాలి- బాపట్ల- చీరాల- ఒంగోలు- సింగరాయకొండ- కావలి- నెల్లూరు- గూడూరు- వెంకటగిరి- శ్రీకాళహస్తి- రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుంటుంది. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ 664 కిలో మీటర్లు దూరాన్ని పన్నెండున్నర గంటల సమయంలో ప్రయాణిస్తుంది. పన్నెండు గంటల సమయాన్ని కుదించాలంటే వందే భారత్ రైలును ఈ రూట్లో నడిపిస్తే మంచి రిజల్ట్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 12 గంటల సమయాన్ని 6-8 గంటల మధ్యలో చేరగలిగితే వందే భారత్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.