మల్యాల : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు ప్రకటించామని.. మరో రూ.500కోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలని.. ఆవిధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు ను తీర్చిదిద్దాలన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అన్నారు. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలి అన్నారు. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని, సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలన్నారు. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలన్నారు. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు అన్నారు. మళ్ళీ వస్తా…. ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు.

