భారత క్రికెట్ జట్టు డిసెంబర్లో దక్షిణాఫ్రికా వెళ్లనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికాతో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలతోపాటు గాంధీ-మండేలా ట్రోఫీ పేరుతో నిర్వహించే 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ను బీసీసీఐ ఖరారు చేసింది. డిసెంబర్ 10 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. దర్బన్, ఖెబెర్హ, జోహన్నెస్బర్గ్ వేదికగా డిసెంబర్ 10, 12, 14 తేదీల్లో టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి.
జోహన్నెస్బర్గ్, ఖెబెర్హ వేదికగా డిసెంబర్ 17, 19తేదీల్లో వన్డే మ్యాచ్లు, మూడో వన్డే డిసెంబర్ 21న పార్ల్ వేదికగా జరుగనుంది. డిసెంబర్ 26-30 తేదీల మధ్య సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్, జనవరి 3-7 మధ్య కేప్టౌన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జయ్ షా షెడ్యూల్ను విడుదల చేశారు.