Wednesday, May 1, 2024

విమాన ప్రయాణికులకు ఇక పై కొత్త రూల్స్

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్లే కన్పిస్తోంది. కొంతకాలంగా రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంటున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలను పాటించట్లేదు. ఈ మధ్యకాలంలో రోజురోజుకీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర పౌరవిమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సిందేనని, లేదంటే విమానం నుంచి దించేయాలని స్పష్టం చేసింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

విమాన ప్రయాణాల సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్రయాణికులు మాస్కు తప్పనిసరిగా ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. మాస్క్‌లు ముక్కు కిందకు ఉండకూడదు. సరిగ్గా ధరించాలి. విమానాశ్రయ ప్రవేశద్వారాల వద్ద సీఐఎస్‌ఎఫ్‌, పోలీస్‌ సిబ్బంది ప్రయాణికులను గమనించాలి. మాస్క్‌ లేకుండా ఎయిర్‌పోర్టు లోపలికి ఎవర్నీ అనుమతించకూడదు. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ లేదా టర్మినల్ మేనేజర్‌ చూసుకోవాలి. ఏ ప్రయాణికుడైనా కొవిడ్‌ 19 నిబంధనలు పాటించకపోతే వారిని భద్రతా సిబ్బందికి అప్పగించాలి. విమానంలోకి ఎక్కిన తర్వాత అందరూ మాస్క్‌లు పెట్టుకునేలా చూసుకోవాలి. సిబ్బంది హెచ్చరించినా మాస్క్‌ పెట్టుకోకపోతే ఆ ప్రయాణికులను టేకాఫ్‌కు ముందే విమానం నుంచి దించేయాలి. ప్రయాణ సమయంలో విమానంలో కొవిడ్‌ నిబంధనలు పదే పదే ఉల్లంఘించినట్లయితే వారిని ‘నిషేధిత జాబితాలోని ప్రయాణికుడి’గా పరిగణించాలి. సదరు విమానయాన సంస్థ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement