Friday, May 3, 2024

ఉపాధి కూలీలకు ఫేస్ రిక‌గ్నేష‌న్‌ అడగడం దుర్మార్గం : నారా లోకేష్‌

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర నంద్యాల జిల్లా నందికొట్కూరులో కొన‌సాగుతుంది. నందికొట్కూరు నియోజకవర్గం జూటూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కాల్వగట్ల పనులు చేస్తున్న కూలీలను యువనేత లోకేష్ కలుసుకొని వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణి అనే ఉపాధి కూలీ మాట్లాడుతూ… మా గ్రామంలో 50 మంది ఈ పని చేస్తున్నాం అన్నారు. ఉదయం 6కి ఒకసారి, 11కు ఒకసారి ఫేస్ రిక‌గ్నేష‌న్‌ కోసం ఫోటోలు దిగాలని నిబంధన పెట్టారు. ఫేస్ రికగ్నిషన్ లేకపోతే డబ్బులు రావంటూ వేధిస్తున్నారు అన్నారు. గతంలో వేలిముద్ర వేస్తే సరిపోయేది. ఉదయం 6గంటల నుంచి 11.30వరకు ఫుల్ టైమ్ కూలీల మాదిరి మాతో పనులు చేయిస్తున్నారు. వారమంతా కష్టపడితే రూ.700 నుంచి 900 ఇస్తున్నారు అన్నారు. దాదాపు మధ్యాహ్నం దాకా మాతో పనులు చేయించడం వల్ల ఇంటివద్ద పిల్లలకు భోజనం కూడా వండి పెట్టలేకపోతున్నాం అని తెలిపారు. బయట రేట్లేమో చుక్కలనంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లు భారీగా పెరిగిపోయాయి. ఇలాగైతే మేమెలా బతకాలని ఉపాధి కూలీలు ఆవేదన చెందారు.
అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ… జనానికి ముఖం చూపించకుండా నాలుగేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ తొంగున్న సైకో సీఎం జ‌గ‌న్ అన్నారు. ఉపాధి కూలీలకు పేస్ రికగ్నషన్ అడగడం దుర్మార్గం అన్నారు. వైసీపీ నాయకులు ఉపాధి హామీ కూలీలను సైతం వదలకుండా జలగల్లా దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దేశం మొత్తమ్మీద అత్యధికంగా ఏపీలోనే రూ.261 కోట్లు దుర్వినియోగమైనట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి అన్నారు. టిడిపి హయాంలో ఉపాధి హామీ పనులు నిర్వహించే ప్రదేశాల్లో మంచినీరు, మజ్జిగ, టెంట్లు ఏర్పాటుచేశాం అన్నారు. దూరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రవాణా చార్జీలను సైతం ప్రభుత్వమే ఇచ్చేలా చేశాం అని గుర్తు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పనులకు కూలీరేట్ల పెంచేలా కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement