Saturday, June 8, 2024

Pune: కారు యాక్సిడెంట్‌ కేసులో మరో ట్విస్ట్‌.. ఇద్దరు వైద్యుల అరెస్ట్‌!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పూణె టీనేజర్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును విచారిస్తున్న పోలీసులు నగరంలోని ససూన్ జనరల్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత బాలుడి రక్త నమూనాలను మార్చినట్టు ఇద్దరు వైద్యులపై అభియోగాలు నమోదయ్యాయి.

అరెస్ట్ అయిన ఇద్దరు డాక్టర్లలో ఒకరు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అజయ్ టవేరే కాగా, మరొకరు ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి హర్నోర్. ప్రమాద సమయంలో బాలుడు మద్యం సేవించలేదని చెప్పేందుకు వీరిద్దరూ కలిసి బాలుడి రక్తనమూనాలను మార్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 19న స్నేహితులతో కలిసి పబ్‌ లో పార్టీ చేసుకున్న బాలుడు తన ఖరీదైన పోర్షే కారులో తెల్లవారుజామున ఇంటికి వస్తూ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను అతివేగంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన 14 గంటల్లోనే నిందితుడైన బాలుడికి బెయిలు మంజూరు చేసిన జువైనల్ కోర్టు.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఆ బెయిల్‌ ని వెనక్కి తీసుకుని జూన్ 5 వరకు అబ్జర్వేషన్‌కు పంపించింది. ఈ కేసులో ఇప్పటికే టీనేజర్ తండ్రి, తాతను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement