Friday, April 26, 2024

C4IR Hyderabad | హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ .. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో వెల్లడి

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ లో తెలంగాణకు తొలిరోజే కీలక విజయం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్)కు చెందిన సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక  సదస్సులో దీనికి సంబంధించి ఒప్పందంపై  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌  మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్ , తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కే.తారక రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందే (Børge Brende) తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జీవశాస్త్రాలు(లైఫ్ సైన్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత దేశంలో సీ4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్  దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.

ఈ కేంద్రం ఏర్పాటు కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు మంత్రి కే తారకరామారావు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు ఈ కేంద్రం ఏర్పాటే నిదర్శనం అన్నారు. తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సెన్సెస్ రంగం ఎదుగుదల, ఎకో సిస్టం పెంపొందించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన ముందడుగుగా ఈ కేంద్రం ఏర్పాటును భావించాలన్నారు. లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

హెల్త్ కేర్,లైఫ్ సైన్సెస్‌ రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు భారతదేశానికి అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయం తోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయాల్లో  హైదరాబాదు కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్‌లో సీ4ఐఆర్ ఏర్పాటు వల్ల ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఫోరమ్ అధ్యక్షుడు బ్రెందే అన్నారు.

వ్యాక్సిన్ లు, ఎన్నో ఔషధాల తయారీలో భారతదేశం, హైదరాబాద్ లకు మంచి ట్రాక్ రికార్డు ఉందని.. నాలుగవ పారిశ్రామిక విప్లవ సాంకేతికతను ఉపయోగించుకొని ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ పవర్ హౌస్ గా ఇండియా మారుతుందన్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ డాక్టర్ శ్యామ్ బిషెన్.ఈ ఎదుగుదలకు తెలంగాణ రాష్ట్రమే నాయకత్వం వహిస్తుందన్నారు. ప్రాంతీయ, జాతీయ , ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగం లో వినూత్న మార్పులు తేవడం తోపాటు రోగులకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంలో ఈ కొత్త కేంద్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. నాలుగు ఖండాలలో విస్తరించి ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నాల్గవ పారిశ్రామిక విప్లవం (4IR) నెట్‌వర్క్ లో హైద్రాబాద్ కేంద్రం 18వది.

Advertisement

తాజా వార్తలు

Advertisement