Thursday, April 25, 2024

అద్భుతంగా ధరణి పురోగతి.. ధరణిలో 28 లక్షలకు పైగా లావాదేవీలు

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : ధరణి మరింత పారదర్శకం అవుతోంది. రైతులకు ఇబ్బందిగా మారుతున్న పలు సమస్యల నివారణకు సీసీఎల్‌ఏ కృషి చేస్తోంది. ఇందుకుగానూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయిస్తున్నట్లు సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు. విరాసత్‌, నాలా వంటి సేవల్లో ఉన్న లోటుపాట్లను సవరించేందుకు విస్త్రృత చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ధరణిలో కనిపించని మిస్సింగ్‌ సర్వే నెంబర్లు, మిస్సింగ్‌ విస్తీర్ణం వంటివాటికి చరమగీతం పాడుతున్నారు. లంచగొండితనం, జాప్యం నివారించి మానవప్రమేయం లేకుండా రికార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన విప్లవాత్మక ధరణి పోర్టల్‌ కీలక అంకానికి చేరువవుతోంది. ధరణి రాకతో గత అవాంతరాలకు, అడ్డగోలు వివాదాలకు తెరపడింది. .

అక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. మానవ ప్రమేయంతో రికార్డుల మార్చివేతకు అడ్డుకట్ట పడింది. రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్‌ ప్రూఫ్‌, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక సిటిజెన్‌ ఫ్రెండ్లి ఆన్‌లైన్‌ పోర్టల్‌గా దేశంలోనే రికార్డును ఈ పోర్టల్‌ సొంతం చేసుకున్నది. భూమి సంబంధిత లావాదేవీలకు ధరణి వన్‌స్టాప్‌ పరిష్కారాన్ని అందిస్తూ అనేక రాష్ట్రాల భూ రికార్డులకు, నిర్వణకు ఆదర్శంగా మారింది. 2020 నవంబర్‌ 2న ప్రారంభించిన ధరణి భూ పరిపాలనలో ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

- Advertisement -

ధరణి పోర్టల్‌ కు 10కోట్ల 72లక్షల 54వేల 406 హిట్లు రాగా, కోట్లాది లావాదేవీలు పూర్తయ్యాయి. వ్యవసాయ సంబంధిత లావాదేవీలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నసమస్యలు కూడా ధరణిలో పరిష్కారమవుతున్నాయి. గతంలో 2 .97 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యుటేషన్లు జరగలేదు. ధరణి ప్రారంభంతో వీటికి కూడా సత్వర పరిష్కారం లభించింది. భూ సంబంధిత 3.16 లక్షల వివాదాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పటివరకు 11.27 లక్షల లావాదేవీలను ధరణి ద్వారా పూర్తి చేశారు. 2 .89 లక్షల గిప్ట్‌n డీడ్‌లను రిజిస్ట్రేషన్లు చేసింది.

లక్షా 83 వేల మందికి సక్సేషన్‌ రైట్స్‌లను ధరణి ద్వారా అందించింది. 16,20,806 రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ దరఖాస్తులుఅందాయి. ఇందులో 15,52,889 రిఇస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. 85392 నాలా కన్వర్షన్లు పూర్తి చేయడం రికార్డుగా చెప్పుకోవచ్చు. పెండింగ్‌ మ్యుటేషన్లు 15364, నాలా 79680 దరఖాస్తులు పూర్తయ్యాయి. ఒక్కో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు గరిష్టంగా 47 నిమిషాల సమయం, పార్టీషన్‌కు 31 నిమిషాలు పడుతున్నాయి. కనిష్టంగా ఒక్కో రిజిస్ట్రేషన్‌కు వేగంగా 3 నిమిషాలు పడుతోంది.

భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పడంతోపాటు తమ భూములకు రక్షణ నెలకొనడంతో రైతులు సంతోషంతో ఉన్నారు. రాష్ట్రంలో 70 లక్షల పట్టాదారులకు చెందిన కోటి 54 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి చెందిన రైతులందరూ ఏవిధమైన సమస్యలు లేకుండా రైతు బంధు పధకాన్ని పొందుతున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా సులభంగా బదలాయింపుకు కూడా ఈ ధరణిలో వెసులుబాటు కల్పించారు. దీనితో, ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రక్రియ ద్వారా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటుగా మారింది.

ధరణి పురోగతి వివరాలు…

-హిట్‌ల సంఖ్య : 10.72 కోట్లు
-ధరణి ద్వారా 28 లక్షలకు పైగా లావాదేవీలు -11 .27 లక్షల అమ్మకపు ట్రాన్‌శాక్షన్లు పూర్తి
-2 .81 లక్షల గిప్ట్‌n డీడ్‌ లను జరిపి లక్షా 80 వేల లబ్దిదారులకు వారసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీ
-రాష్ట్రంలోని 70 లక్షల పట్టాదారులకు చెందిన కోటి 54 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి రికార్డులు
-విధమైన సమస్యలు లేకుండా రైతు బంధు, రైతు బీమా పథకాల లభ్యత.

Advertisement

తాజా వార్తలు

Advertisement