Thursday, May 2, 2024

రంజాన్ కు సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : మంత్రి త‌ల‌సాని

ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించుకొనే రంజాన్ కు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మసీదు కమిటీ సభ్యులతో రంజాన్ ఏర్పాట్ల పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి కారణంగా నిర్వాహించుకోలేక పోయారన్నారు. ఈ సంవత్సరం రంజాన్ ఒక్క పొద్దులు ( రోజా) ఏప్రిల్ 2 లేదా 3 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని, కేవలం 4, 5 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలన్నారు. నెల రోజుల పాటు జరిగే ఒక్క పొద్దుల సందర్బంగా ముస్లీం సోదరులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మసీదు కమిటీ సభ్యుల నుండి వచ్చే పిర్యాదులపై సకాలంలో స్పందించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. మసీదుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, చెత్త, తదితర వ్యర్ధాలను ప్రతిరోజు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎంసీలు వంశీ, ముకుంద రెడ్డి, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, సీజీెం ప్రభు, హార్టికల్చర్ డీడీ లు శ్రీనివాస్, శ్రీదేవి, ఎలక్ట్రికల్ డీఈ లు మహేష్ కుమార్, సుదీర్ కుమార్, ఏఎంఓహెచ్ ప్రవీణ్, మసీదు కమిటీ సభ్యులు సిరాజ్, ఫహీం, దావూద్ రషీద్, యాసిన్, నజీర్, జావేద్, అఖిల్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement