Saturday, May 18, 2024

వ్యవసాయం, విద్యకు పెద్దపీట.. పాలనా రంగంలో మార్పులు – నీతి ఆయోగ్ భేటీలో సీఎం జగన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి 7వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంటలమార్పిడి, నూనె దినుసలు, పప్పు దినుసల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యావిధానం అమలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. తమ రాష్ట్రాల్లో చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో వెల్లడించారు.

అన్నదాతకు అండగా-అన్నిట్లో ముందుగా..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రమైందని, 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగంమీదే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటే ఉన్న వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆ రంగానికి తాము అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నామన్నారు. రైతులకు మరింత అండగా నిలవడానికి వారికి భరోసానిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వ్యవసాయ అవసరాలకు వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కింద ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామనన్న జగన్, విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నామని తెలిపారు. డిజిటిల్‌ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎం యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చామని, మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ద్వారా నిరంతరం పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్నామని సమావేశంలో వివరించారు. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు. దీంతో పాటు ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాప్‌ బుకింగ్‌ కూడా చేస్తున్నామని సీఎం చెప్పారు. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఈ క్రాప్‌ బుకింగ్‌ దోహదపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టామని, రైతులకు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయవచ్చని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్‌నుకూడా ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ఆర్బీకేల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లనుకూడా ప్రారంభిస్తున్నామన్న ఆయన… పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులవైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

బడి బాట-జగన్ మాట..

బడికెళ్లడం, చదువుకోవడాన్ని చిన్నారుల హక్కుగా గుర్తించి సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశామని వెల్లడించారు. స్కూళ్లు మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతో పాటు జీఈఆర్‌ నిష్పత్తిని పెంచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్‌ నిష్పత్తి 99.21 శాతంకాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల్లో విద్యారంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైందని జగన్ వాపోయారు. అందుకే విద్యారంగంలో కీలక అంశాలపై దృష్టిపెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకు వచ్చామన్నారు.

- Advertisement -

అమ్మ ఒడి-భరోసా అది..

తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తోందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15వేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తున్నామని, 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. అంతేకాదు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చామని అన్నారు. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిషు టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నామని, పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్‌ యాప్‌ కూడా అందిస్తున్నామని, 8వ తరగతి విదార్థులకు ట్యాబ్‌ కూడా ఇవ్వబోతున్నట్టు ఆయన తేల్చి చెప్పారు. పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి, నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగునీరు, పెయింటింగ్, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, పిల్లలకు, టీచర్లకు ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఇంగ్లిషు ల్యాబ్, కాంపౌండ్‌ వాల్, కిచెన్‌ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్, కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. మూడు విడతల్లో పూర్తి కానున్న ఈ కార్యక్రమాల్లో మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దామని, ఇందులో డిజిటల్‌ తరగతుల ఏర్పాటు కూడా పూర్తి చేస్తామని నొక్కి చెప్పారు.

విద్యా దీవెనతో వివిధ సదుపాయాలు..

ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషు భాషకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి సబ్జెక్టు వారీగా టీచర్లను 3వ తరగతి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం విద్య ద్వారానే పేదరికం నుంచి బయటపడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యాదీవెన పథకం ద్వారా 100 శాతం ఫీజు రిఎంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందారన్న ఆయన, విద్యార్థులు భోజనం, హాస్టల్‌ ఖర్చుకోసం వసతి దీవెన అమలు చేస్తున్నామని స్పష్టం చేసారు.

నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం..

అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దామని, నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పుకొచ్చారు. 1.6 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే ముందుకు వచ్చింది. కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, 2018–19లో క్యాంపస్‌ల ద్వారా 37వేలమందికి ఉద్యోగాలు వస్తే, 2020–21లో 69వేలు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

అధికార వికేంద్రీకరణపై దృష్టి ..

పౌరుల గడప వద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పని చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతి 50-100 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను కూడా నియమించామని, దీనివల్ల ఉపాధి కల్పన అవినీతి లేకుండా, పారదర్శకంగా సేవలను ప్రజలకు అందించే వీలు కలుగుతోందని నొక్కి చెప్పారు. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టామని తెలిపారు. వివక్షకు, అవినీతికి తావులేకుండా అర్హులైన వారి అందరికీ అన్ని అందాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement