Wednesday, April 17, 2024

నేటి సంపాద‌కీయం – సామాన్యుడిపై గ్యాస్‌ బండ

ఐదు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గ్యాస్‌,పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచుతారంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్షాలు చేసిన ప్రకటనలు అక్షరసత్యమయ్యాయి. వంటగ్యాస్‌ ధర సిలిండర్‌కి 50 రూపాయిలు పెరిగింది. పెట్రోల్‌ లీటర్‌కి తెలంగాణలో 90పైసలు, ఆంధ్రప్రదేశ్‌ లో 88 పైసలు పెరిగింది. గ్యాస్‌ ధరను గత సంవత్సరం అక్టోబర్‌లో 15 రూపాయిలు పెంచారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పైసల వంతున ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నారు. వినియోగదారునిపై ఎక్కువ భారం మోపకుం డా పెట్రో ఉత్పత్తుల ధరలను పైసలలో పెంచుకున్నారు. పెట్రోధరలు పెరుగుతాయంటూ ప్రతిపక్షాలు చెప్పింది జోస్యం కాదు. అధికారంలో ఉన్న పార్టీలు చేసే పనే అది. కాంగ్రెస్‌ కూడా గతంలో ఇలాగే, ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో పన్నులు వేయకుండా ఫలితాలు వెల్లడైన రెండు మూడు రోజులకు పన్నులు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ఇతర ఉత్పత్తుల ధరలను పెంచేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే పద్దతిని అనుసరి స్తోంది.

దేశంలో వినియోగమయ్యే పెట్రోలియం ఉత్పత్తుల్లో 70శాతాన్ని మన దేశం ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నది. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగినప్పుడల్లా మన దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్‌,ఇరాక్‌ల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలుపెరిగాయి.అలాగే, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు కూడాపెరిగాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా దాడికారణంగా పెట్రో ఉత్పత్తుల ధర లు పెరుగుతాయని ఊహించిందే.అయితే, గ్యాస్‌ ధరను ఒకే సారి సిలిండర్‌కి 50 రూపాయిలు పెంచడం వినియో గదారులపై మోయలేని భారాన్ని మోపడమే. వంట గ్యాస్‌ ధరను పెంచడం వల్ల మధ్యతరగతి వారే కాకుం డా, పేదలు కూడా భారాన్ని మోయాల్సి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉజ్వల పథకాన్ని నిరు పేద కుటుంబాలకు చెందిన గృహిణుల కష్టాలుతీర్చడా నికే ప్రవేశపెట్టినట్టు పదే పదే గుర్తు చేసేవారు. అంతే కాకుండా కట్టెల పొయ్యలపై వంట చేయడం వల్ల మహిళ లు కంటి సమస్యలనూ, శ్వాస కోస సమస్యలనూ ఎదు ర్కోవల్సి వస్తోందనీ, వారిని ఆ బాధలనుంచి విముక్తం చేయడం కోసమే గ్యాస్‌ కనెక్షన్ల పథకాన్ని ప్రవేశపెట్టానని సందర్బం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు.

దీంతో గ్రామీణ ప్రాంతాలో మహిళలు సైతం గ్యాస్‌ పొయ్యిలపై వంట చేయడానికి అలవాటుపడ్డారు. గ్రామీణ ప్రాంతాల కు గ్యాస్‌ సిలిండర్లను అందుబాటులోకి తేవడం కోసం గ్యాస్‌ ఏజెన్సీలు మండల కేంద్రాల్లో సరఫరా కేంద్రాలను తెరిచాయి. గ్యాస్‌ వినియోగానికి అలవాటుపడిన గృహిణులు కట్టెల పొయ్యిలపై వంట చేసేందుకు ఇప్పుడు విముఖత చూపుతున్నారు. సహజమే. గ్యాస్‌ సరఫరా బ్రేక్‌ లేకుండా సాగుతున్నందున ప్రత్యామ్నా యాన్ని చూసుకోవడం కూడా మానివేశారు. గతంలో కట్టెలపైనే కాకుండా కిరోసిన్‌ స్టవ్‌లను వినియోగించే వారు, కిరోసిన్‌ వినియోగం బాగా తగ్గిపోయింది. చౌక డిపోలలో బీపీఎల్‌ (బిలో పావర్టీ లైన్‌-దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఉన్నవారికి) కిరోసిన్‌ని రేషన్‌ కార్డులపై ఐదేసి లీటర్ల వంతున సరఫరా చేసేవారు. ఈ కిరోసిన్‌ అసలైన లబ్ధిదారులకు చేరకుండా బ్లాక్‌ మార్కెట్‌కి తరలి వెళ్ళడం సర్వసాధారణమైంది. కిరోసిన్‌ కోసం అవస్థలు పడటం కన్నా గ్యాస్‌ పొయ్యిలపై ఆధారపడటం మొదలు పెట్టారు. అయితే, బ్లాక్‌ మార్కెట్‌ కిరోసిన్‌కే కాకుండా గ్యాస్‌కి కూడా పాకింది. రోడ్డు పక్కన తినుబండారాల ను విక్రయించే వారు సైతం వంట గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తుండటం ఇందుకు కారణం. హోటళ్ళు, రెస్టారెంట్లతోపాటు వాణిజ్య అవసరాల కోసం వినియో గించే గ్యాస్‌ ధర ఎక్కువ కావడం వల్ల ఎల్‌పిజి గ్యాస్‌ ను డీలర్ల ద్వారా సంపాదించి వినియోగించడం బాగా పెరి గింది.

దీంతో గృహస్తులకు గతంలో ఫోన్‌ చేయగానే వెంటనే వచ్చే గ్యాస్‌ వారం, పదిరోజులు దాటినా రాక పోవడం అనివార్యం అవుతోంది. ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్యాస్‌పై సబ్సిడీని క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. పెంచిన 50 రూపా యిలతో వంట గ్యాస్‌ ధర సిలిండర్‌కి వెయ్యి రూపాయి లు దాటింది. చమురు కంపెనీల ఒత్తిడిల పై ధరల పెంపు నకు ప్రభుత్వం ప్రతీసారీ అంగీకారం తెలుపుతోంది . డీజిల్‌ ధర పెరుగుదల వల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యా వసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని వసూలు చేస్తుం టే, రాష్ట్రాలు వ్యాట్‌ని పెంచుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయం నికరమైన ది కావడం వల్ల దానిని వదులుకోవడానికి కేంద్రం, రాష్ట్రాలు సుముఖంగా లేవు. అన్నివిధాల భారాన్ని మోయవలసి వస్తున్నది సామాన్యులే.

Advertisement

తాజా వార్తలు

Advertisement