Friday, April 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

21. రాజైదుష్కృతి( జెందె( జందురుడురారాజైకుబేరుండుదృ
గ్రాజీవమ్మునగాంచె దుఃఖము; కురుక్ష్మాపాలుడా మాటనే
యాజింగూలెసమస్తబంధువులతో, ఆ రాజశబ్దంబు ఛీ!
ఛీ! జన్మాంతరమందునొల్లనుజుమీ! శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!చందురుడు – చంద్రుడు, రాజు – ఐ – రాజు అనిపిలిపించుకొనటం చేత, దుష్కృతిన్ – పాపాన్ని, చెందె – పొందాడు, కుబేరుండు – కుబేరుడు, రారాజై – యక్షులకు చక్రవర్తియై, దృక్-రాజీవమ్మునన్ -నయనమనే పద్మంలో, దుఃఖము-శోకాన్ని, కష్టాన్ని, కాంచె – పొందాడు, కురుక్ష్మాపాలుడు – దుర్యోధనుడు, ఆ మాటనే -రారాజు అనే మాట చేతనే, సమస్తబంధువులతో -అందరు చుట్టాలతోనూ, ఆజిన్ – యుద్ధంలో, కూలెన్ -పడిపోయాడు. ఛీ!ఛీ! – ధిక్!ధిక్!, ఆరాజ శబ్దంబు – ఆ రాజు అనే మాటని, జన్మాంతరము – అందున్ -మఱొక జన్మ యందు కూడ, ఒల్లన్-అంగీకరించను, కోరను, చుమీ! – సుమా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! చంద్రుడు పాపి అవటానికి ‘ రాజు’ అనే పేరు ఉండటమే కారణం. కుబేరుడు కంటి విషయంలో బాధ పొందటం కూడ ‘రారాజు’ (యక్షులకు రాజు) అనే బిరుదం వల్లనే . దుర్యోధనుడు సమస్త బంధుమిత్రులతోనూ యుద్ధంలో నశించటానికి కూడ ఆ ‘రారాజు’ అనే బిరుదాన్ని కాంక్షించటం వల్లనే. అటువంటి ‘రాజ’ శబ్దాన్ని మరుజన్మ మందు కూడ కోరను.
విశేషం: చంద్రుడు గురుపత్నిని అపహరించి పాపాన్ని మూటకట్టుకొన్నాడు. కుబేరుడు పార్వతిని దుర్బుద్ధితో చూచి, అ చూచిన కన్ను కోల్పోయాడు. దుర్యోధనుడి సంగతి తెలిసినదే. వీరంతా పాపులవటానికి కారణం వారు రాజ శబ్దవాచ్యులవటమేనని వారి కున్నసామాన్యధర్మాన్ని గుర్తించాడు ధూర్జటి. ధూర్జటికి ఉన్న రాజులపై గల రోతకి ఈ పద్యం పతాకస్థాయి. రాజు అవటం మాత్రమే కాదు ఆ పదం కూడా ఇష్టం లేదట!

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement