Tuesday, May 7, 2024

Sri Ramaraksha : భద్రాద్రి రామయ్య చెంతకు ‘ శ్రీరామరక్ష ‘ మంత్రపేటిక

నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మొదలు నాటి ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు, నేటి భారత ప్రధాని నరేంద్రమోదీ వరకూ సాగిన, సాగుతున్న భక్తి రసాత్మక ప్రయాణంలో తమ విజయ దుందుభి వెనుక ఉన్న కీలకమైన , అతి నమ్మకమైన స్తోత్రపారాయణమ్ గురించి స్మరించుకుంటే అత్యంత ప్రధానమైన శ్రీరామరక్షాస్తోత్రమ్ గురించి మాట్లాడుకోక తప్పదని ఇటీవల భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం అర్చక పండితులు శ్రీరామచంద్రుని ఆశ్రయించిన వారికి ఎలాంటి ఘన విజయాలో బాహాటంగానే పేర్కొంటున్నారు.

- Advertisement -

ఈ పవిత్రమైన అంశాన్ని ఇంకా వివరంగా చర్చిస్తే ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ‘ శ్రీరామ రక్షా స్తోత్రమ్ ‘ ను పారాయణం చేసినా మొట్టమొదట గుర్తుకొచ్చేది ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త , శ్రీరామరక్షాస్తోత్రమ్ కోటిప్రతుల ఉచిత వితరణోద్యమ సారధి , రాజమహేంద్రవరం భాగవతమందిరం సంస్థాపకులైన పురాణపండ రాధాకృష్ణమూర్తి చటుక్కున స్పురిస్తారనేది గత ఆరున్నర దశాబ్దాలుగా చరిత్ర చెప్పే పవిత్ర సత్యం.

ఆపదలను దాటించి … అమోఘ శక్తులతో ఘన విజయాల్ని ప్రసాదించే శ్రీరామ రక్షా స్తోత్రమ్ లక్షలకొలది ప్రతులను ప్రచురించి … కోటి ప్రతుల ప్రచురణ వితరణ దిశగా భాగవతమందిరం సంస్థాపకులైన పురాణపండ రాధాకృష్ణమూర్తి అపూర్వ ప్రయాణం వేగంగా సాగుతున్న తరుణంలో … సుమారు తొంభై ఎనిమిది లక్షల పైచిలుకు ప్రతులను ఆయన తెలుగు లోగిళ్ళకు ఉచితంగా అందజేసిన క్రమం దాటుతున్న వేళ …. అకస్మాత్తుగా రాధాకృష్ణ మూర్తి స్వర్గపురికి చేరడంతో … ఆ అమోఘ స్తోత్ర బాధ్యతను తండ్రి రాధాకృష్ణమూర్తి ఆశీర్బలంతో కుమారుడు, రచయిత , శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఈ బాధ్యతను నైతిక కర్తవ్యంగా భావించి … తండ్రిని మించినా వేగంతో దేశ దేశాల తెలుగువారికి శ్రీరామ రక్షాస్తోత్ర వైభవాన్ని లక్షల కొలది పుస్తకాల రూపంలో …. చక్కని వ్యాఖ్యానంతో పంచడం గమనార్హం.

సుమారు రెండువందల పై చిలుకు ఆధ్యాత్మిక గ్రంధాల రచయితగా, సంకలన కర్తగా విశేష ప్రాచుర్యం సంపాదించిన పురాణపండ రాధాకృష్ణమూర్తి శ్రీరామోపాసకులుగా , నిత్య శ్రీచక్ర ఆరాధకులుగా సుమారు ఆరు దశాబ్దాలపాటు విశేష ఖ్యాతి గడించారు కాబట్టే …. నాడు దానవీర కర్ణ చలన చిత్ర షూటింగ్ సమయంలో రాజమహేంద్రవరానికి వచ్చిన కథానాయకుడు నందమూరి తారక రామారావు పురాణపండ రాధాకృష్ణమూర్తిని పరమ పూజ్య భావనతో కలిసి మంత్రమయంగా శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఉపదేశంపొందటాన్ని నాటి పత్రికలూ పతాక శీర్షికల్లో ప్రచురించాయికూడా! ఎన్నికల వేళ కూడా ఉభయ సంధ్యలలో తప్పకుండా ఎన్ఠీఆర్ శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేసేవారని అనేక సందర్భాల్లో నందమూరి హరికృష్ణ తన ఇంటర్వ్యూలలో చెప్పేవారుకూడా. అంతే కాదు ..ఈనాడు పత్రికాధినేత రామోజీరావు సతీమణి రమాదేవి సైతం తన కుమారుడు చెరుకూరి కిరణ్ తో కలిసి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం భాగవతమందిరానికి చేరి పురాణపండ రాధాకృష్ణమూర్తిని కలిసి శ్రీరామరక్షాస్తోత్ర పారాయణ విశేషాల్ని తెలుసుకోవడం మరొక ప్రత్యేక విశేషంగానే చెప్పుకోవాలి.

ఇప్పుడు ఝమ్ ఝా మారుతంలా పురాణపండ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాలను శ్రీరామ రక్షాస్తోత్ర పరిమళాలతో నింపేస్తున్నారు. ఇటీవల అయోధ్య శ్రీరామచంద్ర విగ్రహ ప్రతిష్టాసమయంలో భారతీయ జనతాపార్టీ శ్రేణులు పురాణపండ శ్రీనివాస్ ను సమ్ప్రదించి కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి సమర్పణలో వేలకొలది ప్రతులు ప్రచురించి పంచడం అభినందనీయం.

ఎన్నో ఉద్విగ్నవేళల్ని , ఆపదలను తరిమి … అద్భుతాలను ప్రసాదించే ఈ శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈ శ్రీరామ నవమి కానుకగా విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ‘ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం’ సంస్థ భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు విచ్చేసే వేలాది భక్తులకు ఉచితంగా అందజేసే సదుద్దేశంతో సుమారు యాభైవేల ప్రతులను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అందజేయనున్నారు.

బుధకౌశిక మహర్షి ప్రణీతంగా ఈ జాతికి లభించిన శ్రీరామరక్షాస్తోత్రమ్ దివ్య గ్రంధాన్ని పురాణపండ రాధాకృష్ణమూర్తి మంత్రబలంతో ఈ తెలుగు జాతికి ప్రసాదించగా … ఆయన కుమారుడు పురాణపండ శ్రీనివాస్ అమోఘ సంకల్పంగా యింతటి మహాకార్యాన్ని భుజాన వేసుకోవడంపట్ల తెలుగు రాష్ట్రాలలో పండిత ప్రకాండులు మొదలు … అర్చక పండితులు .. పీఠాధిపతులు శ్రీనివాస్ శ్రీకార్యాన్ని బలపరుస్తున్నారు.

ఇప్పటికే తెలుగు పురాణపండ శ్రీనివాస్ రసభరిత అమోఘ ప్రసంగాలు, పరమాద్భుత గ్రంధాలు … ఇటు సినెమా రంగం మొదలు, రాజకీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగాలకు గొప్ప ఆకర్షణగా చెప్పక తప్పదు.

ఏది ఏమైనా ఈసారి శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు జరిపే వందల కొలది పందిళ్ళకే కాకుండా భద్రాద్రి రాముని సన్నిధికి తన తండ్రి రాధాకృష్ణమూర్తి తేజస్సుతో పురాణపండ శ్రీనివాస్ ఈ మంత్రవైభవ గ్రంధాన్ని జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం సమర్పణలో అందించడాన్ని భద్రాద్రి దేవస్థాన అధికార వర్గాలు అభినందనలు వర్షిస్తున్నాయి

అందులోనూ … పురాణపండ శ్రీనివాస్ పుస్తకసౌందర్యం మామూలుగా ఉండదని … ఇట్టే మనస్సును, గుండెని హత్తుకుంటుందని భద్రాద్రి ప్రధానార్చకులు పేర్కొనడం సమంజసం అనక తప్పదు.

శ్రీ రామచంద్రభగవానుని సంపూర్ణ అనుగ్రహం ఉండటం వల్లనే పురాణపండ శ్రీనివాస్ ఈ మనోహరమైన రామకార్యాన్ని భద్రాద్రికి సమర్ధవంతంగా చేర్చగలుగుతున్నారని, ఈ పుస్తకంలో శ్రీనివాస్ అందించిన వ్యాఖ్యానాలు రసాత్మకంగా ఆకట్టుకుంటాయని భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి రమాదేవి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement