Thursday, April 25, 2024

గురుకృపతో జ్ఞానసిద్ధి

గురుబ్రహ్మ గురుర్విష్ణు:
గురుదేవో మహశ్వర:
గురు స్సాక్షాత్‌ పరంబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమ:
గురువే బ్రహ్మ విష్ణువు మహశ్వరుడని ఆయనను మించిన దైవం లేదని స్మృతులు శృ తులు చెబుతున్నాయి. భగవతా అవతారాలైన రాముడు, కృష్ణుడు కూడా వశిష్ట, సాందీపుల వద్ద విద్యను అభ్యసించి ఆదర్శంగా నిలిచారు.
రాముడు భవిష్యత్‌లో చేసిన ధర్మపాలన గురువులు విశ్వామిత్రుడు, వశిష్టుల బోధనలే కారణం. ముఖ్యంగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణకు తీసుకువెళ్లినప్పుడు అస్త్రశస్త్రాలతో పాటు వారి పూర్వీకుల వైభవం, రాజ ధర్మం, సత్యపాలనలపై పలు బోధనలు చేసారు. అవే రామచంద్రుడు భవిష్యత్‌లో రాజుగా ధీరోదాత్త లక్షణాలతో ధర్మపాలన ఎలా చేయాలో నేర్పించాయి. ఇప్పటికీ రామరాజ్యమని చెప్పుకునే రాముని పాలన గురుబోధల పుణ్యమే. గోకులంలో పెరిగిన బలరామకృష్ణులు కూడా కంసవధ అనంతరం సాందీపుని ఆశ్రమంలో విద్యను అభ్యసించారు. అనంతరమే సింహాసనం అధిష్టించారు. గురుభక్తితో అష్టసిద్ధులు లభిస్తాయని వెనుక మరో కథ తెలుసుకోవాలి.
ఒక రాజ్యంలో వేదధర్ముడు అనే గురువు శిష్యులకు వేదం బోధి స్తుండేవారు. ఒకసారి వేద ధర్ముడు శిష్యులను పరీక్షించే నిమిత్తం ఒక పరీక్ష పెట్టాడు.’ తాను గత జన్మ పాపం కొంత తపస్సుతో పోగొ ట్టుకున్నాను. ఇంకా శేషం ఉం దని ఆ పాపం పోగొట్టుకోనిదే మోక్షం సిద్ధించదని అందుకు కాశీ వెళ్లి అక్కడ తన పాపం ప్రక్షాళన చేసుకుం టానని సహాయకుడిగా ఎవరైనా శిష్యుడిని రమ్మన్నాడు. అందుకు మిగిలిన శిష్యులు మౌనం వహంచగా దీపకుడు మాత్రం ఆ పాపం తానే అనుభవిస్తానన్నాడు. కాని తానే పాప ప్రక్షాళన చేసుకోవాలన్నా రు గురువు. తనకు సహాయకుడిగా వస్తే చాలన్నారు. గురుశిష్యులు కాశీ పట్టణం చేరి ఒక కుటీరంలో నివసించసాగారు. వెంటనే గురువు కుంటి గుడ్డిలతోపాటు కుష్టు రోగగ్రస్తులైనారు. రోగంతో పాటు ఆయ నకు కొంత కోపం అధికమైంది. దీపకుడు గురువు సేవ చేస్తున్నా సరి గా చేయడంలేదని వేధించేవాడు. అయినా గురువుగారి రోగం దృ ష్ట్యా కోపం సహజమేనని భావిస్తూ తన శరీర శ్రద్ధ పట్టించుకోక సేవ చేస్తున్నాడు. అతని గురుభక్తికి మెచ్చిన కాశీ విశ్వనాథుడు దీపకుడికి ప్రత్యక్షమయ్యాడు.
గురుభక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడు. దీపకుడు వరం తిరస్కరించడంతో దేవ తలు, విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు. స్వామి! వరాలు కోరి నిన్ను పూజించే భక్తులను ఉపేక్షించి, మిమ్మల్ని ఏనాడు సేవిం చని నన్ను అనుగ్రహంచారెందుకు? అని ప్రశ్నించాడు. విష్ణువు నాయనా! గురువును సేవిస్తే నన్ను సేవించినట్లే. ఏమయినా వరం కోరుకోమ న్నాడు. అంతట దీపకుడు స్వా మీ! గురువు సకల దేవతా స్వరూపమని వేదాలు శాస్త్రా లు చెబుతున్నాయి కదా. మీరిచ్చే వరం ఆయన కూడా ఇవ్యగలడు కదా అన్నాడు. విష్ణువు అంతట తామిద్దరం సమానమేనని ఇప్పటికైనా వరం కోరుకోమన్నా డు. అప్పుడు దీపకుడు నా గురుభక్తి ఎల్లప్పుడూ వృద్ధిచెందేలా వరం ఇవ్వ మని కోరాడు. గురువే పరమార్ధమని, పరబ్రహ్మమని తెలుసుకుని ఆయ నను సేవిస్తే వారికి దేవతలు వశమవుతారని దీపకుని ఆశీర్వదించి విష్ణు వు, దేవతలు వెళ్లిపోయారు. అంతట వేదధర్ముడు కూడా తనకు ఏ పాపం లేదని కేవలం శిష్యుడిని పరిక్షించే నిమిత్తం అలా రోగగ్రస్తుడిలా మారానన్నాడు. దీపకుని గురు భక్తికి మెచ్చి సర్వ శాస్త్ర పారంగతుడ్ని చేయడమే కాక నీకు అష్టసిద్ధులు నవనిధులు సేవ చేస్తాయని ఆశీర్వ దించారు. గురు కృపతో జ్ఞాన సిద్ధి పొందిన శిష్యుల ఉదంతం గురువు సాక్షాత్‌ భగవత్‌ స్వరూపమని నిరూపిస్తోంది.
ఒక గురువు వద్ద శిష్యుడు విద్యను అభ్యసిస్తున్నాడు. ఎన్నిరోజులై న గురువు నీకింకా బుద్ది స్థిరంకాలేదని వేదం బోధించేవారుకాదు. ఒకసారి ఆ శిష్యుడు గురువు చెప్పిన పనిచేయలేదు. దాంతో ఆయన దూషించారు. అంతే ఆయనను వదిలి ఆ శిష్యుడు మరో గురువు వద్దకు చేరాడు. పూర్తి వృత్తాంతం విన్న కొత్త గురువు. అతన్ని మందలించి గురు ద్రోహాన్ని మించిన పాపం లేదు. గురుద్రోహకి ఇహపరాలలో సుఖముండ దు. ఎప్పటికీ జ్ఞానం లభించదు. నీవు నీ గురువును శరణు వేడడమే తక్షణ కర్తవ్యమని బోధించాడు. అనంతరం ఆ శిష్యునికి గురువు అనుగ్రహం సాధించాలంటే నిస్వార్థ సేవ, భక్తి కారణమని ఉదాహరణగా ఒక కథ చెప్పాడు. ద్వాపరయుగంలో ధౌమ్యుడు అనే రుషి వద్ద అరుణి, బైదుడు, ఉపమన్యువు అనే శిష్యులు వేదాన్ని అభ్యసిస్తుండేవారు. ఒకరోజు గురువు అరుణిని పిలిచి పంట చేనుకు నీళ్లు పెట్టి రమ్మన్నాడు. అలాగేనని పొలం వెళ్లి నీరు పెట్టే యత్నంలో కాలువకు గండిపడింది. ఎంత ప్రయత్నించినా నీరు పొలంలోకి ఎక్కడంలేదు. చివరకు గండికి అడ్డంగా పడుకుని గురు వుని ధ్యానిస్తూ నీరు చేనులోకి పారేలా చేసాడు. చీకటిపడినా అరుణి ఆశ్ర మానికి రాకపోవడంతో గురువుగారు వెతుకుతూ పొలం వచ్చారు. చేలో నీరు నిండుగా పడ్డాయి.
అరుణి జాడ లేదు. అరుణీ అని పిలిచారు. గండికి అడ్డంగా పడుకున్న అరుణి చిన్నగా శబ్దం చేసాడు. గురువుగారు అక్కడికివచ్చి అతన్ని లేపి కౌగిలించుకుని సంపూర్ణంగా అనుగ్ర హంచారు. వెంటనే అతను సర్వశాస్త్ర పారంగతుడైనాడు. ఆ తర్వాత అతన్ని దీవిస్తూ నాయ నా! నీవు ఇంటికి వెళ్లి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించమన్నారు. అతను గురువు వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్లి లోక పూజ్యుడైనాడు. ఆ తరువాత మరో శిష్యుడు బైదుడ్ని పిలిచి పొలంలో పంట కోయించి ధాన్యం ఇంటికి చేర్చమని బండి, ఒక దున్నపోతు ను ఇచ్చారు. బైదుడు పంట కోయించి ధాన్యం పోత పోయించి బండి మీద చేర్చి ఆశ్రమానికి తరలించేందుకు కాడికి ఒక వైపు దున్నపోతు మరోవైపు తాను లాగుతూ బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక దున్న లాగకపోవడంతో దాన్ని తప్పించి ఒక్కడే లాగుతూ స్మృహ తప్పి పడిపోయాడు. గురువుగారు వచ్చి బైదుడ్ని కాడి నుంచి తప్పించి, అతడి గురుసేవకు ప్రీతి చెంది సర్వశాస్త్ర పండితుడుగా అనుగ్రహంచి ఇంటికి పంపారు. కొద్దికాలంలో అత నూ లోక ప్రసిద్ధుడైనాడు. ఇక ఉపమన్యువు మాత్రమే గురువును సేవిస్తుండేవాడు. అతను అతిగా భోంచేసేవాడు. ఫలితంగా విద్యభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ఒ కరోజు అతన్ని పిలిచి ఆవులను మేపుకు రమ్మని పంపారు. ఉపమన్యువు మధ్యాహ్నం వరకూ మేపి ఆకలి వేయడంతో ఆవులను ఇంటికి తోలుకువచ్చాడు. అంత ధౌమ్యుడు సూర్యాస్తమయం వరకూ ఆవులను మేపుకు రావాలన్నారు. సరే అని మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు స్నానం చేసి సంధ్యవార్చుకుని దగ్గరలోని బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి భిక్ష తీసుకుని తినేవాడు. గురువు గారు తెలుసుకుని ఆ భిక్ష నాకు సమర్పించాలన్నారు. అలాగే భిక్ష గురువుగారికి సమర్పించి రెండోసారి భిక్షకు వెళ్లి భుజించేవాడు. అతని శరీరం పుష్టిగా మారడంతో గురువు ఉపమన్యు వును ఏమి చేస్తున్నావని అడిగారు. రెండో భిక్ష సంగతి తెలిపాడు. దాంతో రెం డో భిక్ష కూడా తనకే ఇవ్వమన్నాడు. అలాగేనని ఆ భిక్ష కూడా గురువుకు సమర్పించి ఆకలి వేస్తే ఆవుల పాలు తాగేవాడు. ఏమాత్రం శరీరం తగ్గని ఉపమన్యువును గురువు ఆకలి ఎలా తీర్చుకుంటున్నావ ని అడిగారు. అతను ఆవుల పాల విషయం చెప్పాడు. అప్పడు ఓరి! వెధ వ.. ఎంగిలి పాలు తాగుతున్నావా అని అరిచారు. ఆ మరునాడు ఆకలి వేస్తే ఎంగిలి లేని జిల్లేడుపాలు తాగే ప్రయత్నంలో అవి కళ్లలో పడి కళ్లు కనిపించలేదు. ఆవులను వెతుకుతూ అడవిలోకి వెళ్లి ఒ క నూతిలో పడ్డాడు. ఎంతకీ ఆవులు, ఉపమన్యువు రాకపోవడంతో గురువు వెతుకుతూ వచ్చారు. ఉపమన్యువు నూతిలో పడడం, కళ్లుపొవడం తెలుసుకుని అశ్వనీ దేవతలను ప్రార్థించమన్నారు. గురువు కృపతో ఉపమన్యువు ప్రార్థించగానే కళ్లు వచ్చాయి. అతని గురుభక్తికి మెచ్చి అనుగ్రహంచి నీ కీర్తి దేశదేశాలా వ్యాప్తిస్తుందని ఆశీర్వదించారు.
కనుక గురువు అనుగ్రహంతో పొందలేనిదిలేదు. గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికి వేదవేదాంగాలు కరతలామలకం అవుతాయి. అష్టసిద్ధులు ఆధీనమై సర్వజ్ఞుడవుతా డు. పురాణాలు, ఇతిహాసాల్లో గురువులు శిష్యులను కటాక్ష వీక్షణాలతో సర్వ శాస్త్ర పండితు లను చేసిన తార్కాణాలు అనేకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement