Friday, April 19, 2024

People’s March – 10 హామీల‌తో భ‌ట్టి భ‌రోసా….

మహబూబ్‌నగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన ఎండగట్టడం కోసం యావత్‌ తెలంగాణ ప్రజలకు మద్దతుగా అదిలాబాద్‌ జిల్లా పిప్పిరి నుంచి ప్రస్తుత పాలమూరు జిల్లా జడ్చర్ల వరకు నా పాద యాత్ర 806 కిలోమీటర్ల వరకు చేరుకుం దన్నారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకుని నేను యాత్రను కొనసాగిస్తున్నానని, రాహుల్‌ ఇచ్చిన సందేశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లుతున్నట్లు భట్టి తెలిపారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ.. పది హామీలతో ఆయన ప్రజలకు భరోసానిచ్చారు. దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ అన్నీ కనుమరుగయిపోయాయని, రాహుల్‌ గాంధీని అప్రజాస్వామికంగా జైలు శిక్ష విధించడంతో పాటు- పార్లమెంటు- సభ్యత్వాన్ని రద్దు చేయడం దుర్మార్గమన్నారు. బీజేపీ సర్కార్‌ తీరును నిరసిస్తూ కర్ణాటక ప్రజలు.. అక్కడి నుంచి తరిమి కొట్టారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం కుటుంబ పాలన చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో 24 లక్షల ఎకరాలను పేదలకు ఇస్తే .. ఈ ప్రభుత్వం వాటిని లాక్కోంటదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తిరిగి వారికే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములను నిరుపేద రైతుల దగ్గర లాక్కోవడం దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని , ధరణి పోర్టల్‌ను బంగాళా ఖాతంలో కలిపేస్తామని ఆయన హెచ్చరించారు.

పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ప్రజల కోసమేనని, ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకే నా పాదయాత్ర అన్నారు. పాదయాత్రలో భాగంగా అదిలాబాద్‌ జిల్లా ఉట్కూరు మండలం దేవగూడలో అక్కడి పోడు భూముల రైతుల గోడు దు:ఖాన్ని కలిగేలా చేసిందని, సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్‌ పరం చేయడం, నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతమన్నారు. రాబోయే ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలోనూ ఉంటాయని, బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ రూ. 500లకే ఇస్తామన్నారు. పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి బీడు భూములకు నీళ్లు ఇస్తామన్నారు.

కాంగ్రెస్‌ వల్లే తెలంగాణ కల సాకారం – – హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు

తెెలంగాణ ప్రజల ఆకాంక్షను తలంగాణ ప్రజల ఆకాంక్షను, కలను కాంగ్రెస్‌ పార్టీ నేరవేర్చిందని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుక్కు అన్నారు. డెబ్బై ఏళ్ల స్వరాష్ట్ర సాధన పోరాటంలో దాదాపుగా 15 వందల మంది ప్రజలు, యువకులు ఆత్మహత్యలు చేసుకుకుంటే.. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చలించిపోయి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను అధిష్టానానికి విన్నవించుకుంటే.. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని, మరే పార్టీ వల్ల కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సభకు హాజరయ్యే ముందు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తనకు ఫోన్‌ చేశారని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన మేలును చేయాలని చెప్పారన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టుకున్నదని ఆయన గుర్తు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నేరవేర్చిందని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తొమ్మిది ఏళ్లు గడిచినా కూడా.. ఇక్కడి ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల వంటి హామీలను ఇంకా నెరవేరలేదని ఆయన విమర్శించారు. వచ్చే ఐదారు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని ప్రశ్నించాలని ఆయన కోరారు.

తమ రాష్ట్రంలో ఉద్యోగులకు, అధికారులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తూ వారికి అండగా ఉంటు-న్నామన్నాని వివరించారు. నాడు దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన సమయంలో 40 కోట్ల జనాభా ఉండగా, ఇపప్‌డు 140 కోట్ల జనాభాకు చేరిందన్నారు. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం హాయాంలో దేశంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ అందరి మదిలో నిలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి అన్ని రకాల అభివృద్ధి ఫలాలను ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ద్వారా పొందాలని ఆకాంక్షించారు.

- Advertisement -

పాలమూరు నుంచి 14 సీట్లు ఇవ్వాలి – టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపు

పాలమూరు బిడ్డనైన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ టీ పీసీసీ చీఫ్‌గా తనకు అవకాశం ఇచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ జిల్లాలో ఉన్న 14 అసెంబ్లిd, 2 పార్లమెంట్‌ సీట్లను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని నిధులన్ని గజ్వేలు, సిద్ధిపేట, సిరిసిల్లకే పోతున్నాయన్నారు. కేసీఆర్‌ పాలమూరుకు వస్తే ఎంపీగా గెలిపించి రాజకీయ బిక్ష పెట్టామన్నారు. బోయలను ఎస్టీలో చేరుస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కుల వృత్తులు చేసుకోవాలని అంటున్న కేసీఆర్‌.. ఆయన కుటుంబం మాత్రం అధికారం అనుభవించాలా..? అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాకనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement