Wednesday, May 1, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 8.

నైవ కించిత్‌ కరోమీతి
యుక్తో మన్యేత తత్త్వవిత్‌ |
పశ్యన్‌ శృణ్వన్‌ స్పృశన్‌ జిఘ్రన్‌
అశ్నన్‌ గచ్ఛన్‌ స్వపన్‌ శ్వసన్‌ ||

9.
ప్రలపన్‌ విసృజన్‌ గృహ్ణన్‌
ఉన్మిషన్‌ నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు
వర్తంత ఇతి ధారయన్‌ ||

తాత్పర్యము : దివ్య చైతన్య యుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసన జూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవమునకు ఏదియును చేయనట్లుగా అవగాహన కలిగి యుండును. ఏలయన మాట్లడునప్పుడు, గ్రహించునప్పుడు, విసర్జించునప్పుడు, కనులు తెరచుట లేక మూయుట జరుగునప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థములతో వర్తించుచున్నవనియు మరియు తాను వాని నుండి దూరముగా నుంటిననియు అతడు సదా అవగాహన కలిగి యుం డును.

భాష్యము : ప్రతి కార్యము కర్త, కర్మ, పరిస్థితి, ప్రయత్నము మరియు అదృష్టము అను ఐదు కారణములపై ఆధారపడి యుండును. కర్మకు అతీతుడైన విశుద్ధాత్మయగు భక్తుడు, భగవంతుని ప్రీత్యర్థమే కార్యములు చేసినపుడు ఈ ఐదు కారణములు అతనికి అడ్డురావు. అందువలన చూడటానికి తను కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను ఉపయోగించినప్పటికీ ల క్ష్యము ఇంద్రియ తృప్తి కాక బగవంతుని తృప్తి అగుటచే అవి ఆధ్యాత్మిక కార్యక్రమములగును. తాను భగవంతుని నిత్య సేవకుడుననే సంపూర్ణ జ్ఞానము చేత ఇంద్రియములను భగవత్సేవకు తప్ప అన్యధా ఉపయోగించడు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement