Friday, May 17, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 23

అంతవత్తు ఫలం తేషాం
తద్భవత్యల్పమేధసామ్‌ |
దేవాన్‌ దేవయజో యాంతి
మద్భక్తా యాంతి మామపి ||
తాత్పర్యము : అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజించుదురు. కాని వారొసగెడి ఫలములు అల్పములు, తాత్కాలికములై యున్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకముల చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమున చేరుదురు.

భాష్యము : కొంతమంది భగవద్గీత పై వాఖ్యానము చేస్తూ ఎవరిని పూజించినా దేవాదివేవుడినే చేరుకోవచ్చు అని చెప్పుదురు. కాని ఈ శ్లోకములో ఆ అవగాహన తప్పని నిరూపించబడినది. దేవతలను పూజించిన వారు ఆ దేవతల లోకాలకు మాత్రమే వెళ్ళెదరు. ఇంద్రున్ని పూజించిన వారు ఆయన ఉండే లోకానికే వెళతారు. అలాగే భగవంతుణ్ణి పూజించిన వారు మాత్రమే భగవద్దామానికి వెళ్ళి అవకాశాన్ని పొందుతారు. దేవతలు భగవంతుని శరీరములో భాగములే అయినప్పటికి, మనము నోటి ద్వారానే ఆహారాన్ని గ్రహించినట్లు, భగవంతున్ని సేవిస్తూ అందర్ని సేవించినట్లు, మిగిలిన అవయవాల ద్వారా ఆహారాన్ని స్వీకరించలేము. అలాగే వేరు వేరు దేవతలు భగవంతునికి సమానులు గాని స్వతంత్రులు గాని ఎన్నటికీ కాలేరు. అంతేకాక దేవతలను పూజిస్తే వచ్చే ఫలితాలు అశాశ్వతమైనవి. దేవతలు వారి లోకాలే అశాశ్వతమైనపుడు వారిచ్చే వాటి గురించి చెప్పనేల? అయితే భగవంతుని భక్తి ద్వారా వచ్చే ఫలితాలు శాశ్వతమైనవి, అపరమితమైనవి. భగవంతుడు తరగని దీవెనలను కృపను ఇవ్వగలడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement