Wednesday, May 1, 2024

ధర్మ నిష్ట – రాజు ప్రవర్తన

పంచమ వేదమయిన శ్రీ మహాభారతంలో భీష్మాచా ర్యుడు ఒక అద్భుతం. సదా స్మరణీయుడు. కురు క్షేత్ర సంగ్రామం పరిసమాప్తమైంది. శరశయ్య మీద ఉన్న భీష్మాచార్యుడు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడానికి ఉత్త రాయణం కోసం ఎదురుచూస్తున్నాడు. ఓఘవతి నదీ తీరాన ఒక పవిత్ర ప్రదేశంలో భీష్ముని అంపశయ్య కొలువై ఉన్నది. ఆయన చుట్టూ వ్యాసాది మహా మునులు కూర్చుని ఉన్నారు. శ్రీకృష్ణుడు పాండవులను తీసు కుని అక్కడికి వచ్చాడు. మహోన్నతులందరికి నమస్కార ములు సమర్పించిన భీష్మాచార్యుని వద్దకు వచ్చారు. అంప శయ్యపైనున్న పితామహుని చూసి పంచ పాండవులు చలిం చిపోయారు. ముందుగా శ్రీ కృష్ణ పరమాత్మను సంభాషణ ప్రారంభించమని యుధిష్టిరుడు తన నేత్రములతో కోరాడు. అది గ్రహించిన శ్రీకృష్ణ భగవానుడు సంభాషణకు నాంది పలికాడు. ” భీష్మాచార్య! మానసిక దు:ఖంకంటే శారీరక దు:ఖం భరించగలదైనా అది ఎంతో బాధతో కూడి ఉంటుంది. శరీ రంలో చిన్న ముల్లు గుచ్చుకుంటేనే భ రించడం కష్టం, అటు వంటిది బాణాలనే శయ్యగా చేసుకుని భూమిని తాకకుండా పరుండిన మీ శరీర బాధ గురించి చెప్పనలవి కాదు. దేవత లకు కూడ ఉపదేశించగల శక్తి, జ్ఞానము కలిగిన మీరు ఇది దైవ నిర్ణయమని భావించి ఆనందంగా భరిస్తున్నారు. దేహాత్మభావన లేని మీరు తొమ్మిదవవస్తువుగా బ్రహ్మ జ్ఞానులతో కొనియాడబడుచున్నారు. దేవతలను మించిన సర్వ సద్గుణములు కలిగిన త్యాగమూర్తి. ధర్మా ధర్మ విచక్షణ చేయగల సమర్ధులు. అమిత దు:ఖంలోనున్న యుధిష్టిరు నకు శోకాన్ని దూరం చేయగల సనాతన ధర్మ బోధన చేయం డి” అని విన్నవించాడు.
అంత భీష్మాచార్యుడు.
నారాయణ: పరం బ్రహ్మ నారాయణ: పరంతప:
నారాయణ: పరోదేవ: సర్వం నారాయణ: సదా
నమో ధర్మాయమహతే నమ: కృష్ణాయ వేధసే
బ్రహ్మణభ్యో నమస్కృత్య ధర్మాన్‌ వక్ష్యామి శాశ్వతాన్‌.

”మహత్తమగు ధర్మమునకు నమస్కారము. విశ్వ విధాతయగు శ్రీకృష్ణునకు నమస్కారము. బ్రహ్మ జ్ఞానులకు నమస్కారము. నారాయణుడైన శ్రీకృష్ణుడే పరబ్రహ్మ. అంతటా నిండియున్న నారాయణుడే సర్వము.” అని భగ వానుని స్తుతించి ధర్మరాజునకు ధర్మ బోధ చేయుటకు ఉద్యు క్తుడైనాడు.
యుధిష్టిరుడు మిగిలిన పాండవులు భీష్మాచార్యుని పాదములు స్పృశించి భక్తితో కూర్చున్నారు. భీష్ముని అను మతితో ధర్మరాజు ”పితామహ ధర్మ నిష్ట కల పరిపాలకుడు తన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే ఎలా ప్రవర్తించాలి” అని ప్రశ్నించాడు.
అంత ఆచార్యుడు నీ ప్రశ్నకు సమాధానంగా మహా తత్వదర్శి వామదేవుడు పవిత్ర చిత్తుడైన వసుమనుడనే రాజుకు చేసిన ఉపదేశం చెపుతాను వినమన్నాడు.
ధర్మ మేవానువర్తస్య న ధర్మాద్‌ విద్యతే పరమ్‌
ధర్మే స్థితాహి రాజానో జయన్తి పృథివీ మిమామ్‌

వాసుదేవుడు, వసుమను రాజుతో ఇట్లు చెప్పడం ప్రారంభించాడు భీష్మ పితామహుడు.
”ధర్మమును అనుసరించుము, ధర్మమును మించినది మరియొకటి లేదు. ధర్మమునందు నిలకడ కలిగిన రాజు ఈ భూమినంతనూ పరిపాలించగలడు.
పాపాత్ముడైన మంత్రి సహాయంతో ధర్మానికి హాని కలి గించే రాజు తన కుటుంబంతోపాటు నాశనమైపోతాడు. హితకరమైన సలహాలను పాటించేవాడు, ఈర్శ్యారహితుడు, జితేంద్రియుడు, బుద్ధిమంతుడు అయిన రాజు నదుల ప్రవా హంతో సముద్రము పెరిగినట్లు వృద్ధి పొందుతాడు.
కృపణుడు, స్నేహశూన్యుడు అనవసరంగా ప్రజా దండన చేసేవాడు, బుద్దిహీనుడు, అపరాధులను గుర్తించ లేనివాడు అనతికాలంలోనే అపకీర్తి పొంది పదవీచ్యుతు డవుతాడు.
బల గర్వంతో బలహీనులపై అత్యాచారాలు చేసే రాజు యొక్క రాజ్యంలో అతని అనుచరులు కూడా అటువంటి ప్రవర్తననే కలిగి జీవిస్తారు. తద్వారా ప్రజలు కూడా ఉద్దంత తో ప్రబలిపోయి చివరకు రాజ్యం నశించిపోతుంది.
అసత్యం ఆడకూడదు. చెప్పకుండానే ప్రజలకు ప్రియ మైన పనులుచేయాలి. కోరికతో గాని, క్రోథంతో గాని ద్వేషా నికి లోనయి గాని ఎటువంటి పరిస్థితిలో ధర్మాన్ని విడనాడ కూడదు.
ఎవరు ఏమి అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సంకోచం ఉండకూడదు. ఏ పనిలోను తొందర పాటు పనికి రాదు. రాబడి తగ్గితే దు:ఖించకూడదు. తనకు ప్రియం కలిగినప్పుడు పొంగిపోకూడదు. పెద్ద పెద్ద పనులకు మిక్కిలి అనుకూలురను, జితేంద్రియులను, పవిత్రమైన వారిని, పాండిత్యం లేని వారిని, ఉదారులను, మద్య పానం చేసేవారిని, జూదరులను, స్త్రీలంపటులను, వేట సరదా కల వారిని మహత్త్వ పూర్ణమైన కావ్యములలో నియమిస్తే ఆ రాజు యొక్క రాజ్యలక్ష్మి వెంటనే నశించిపోతుంది.
దుర్గ రక్షణ సాధనాలు, యుద్ద సామాగ్రి, న్యాయ వ్యవస్థ, ఉన్నతమైన మంత్రాంగము, సమయానికి ప్రజలకు సుఖాన్ని చేకూర్చడం ఈ ఐదు విషయాలలో జాగరూకులై ఉంటే ఆ రాజ్యం సదా వృద్ధి చెందుతుంది. కష్ట సమయాలలో ప్రజలను వదలని వారినే రాజుగా ఎంచుకుంటారు. గుణ వంతులైన తన బంధువులను గౌరవించనివాడు, మిక్కిలి క్రోధం గలవాడు, ద్వేషంతో రగిలిపోయేవాడు రాజ్య పాల నకు రాజుగా అనర్హుడు. బలహీనుడైన శత్రువును తక్కువ అంచనా వేయకూడదు.
రాజ్యం యొక్క మూలాలు బలిష్టంగా లేనప్పుడు ఇతర దేశాలపై అధికారం పొందాలని చూడకూడదు.
దేశం ధనధాన్య సంపూర్ణమై, రాజ భక్తులైన ప్రజలు కలిగి ఉండి, మంచి యోగ్యులైన మంత్రులుండి, సుశిక్షితులైన సైని కులు సంతుష్టులై ఉన్నప్పుడు కొద్ది సైన్యములోనైనా విజయ ము పొందవచ్చు. దేశ ప్రజలు ధన సంపన్నులై జీవులపై దయ కలిగి ఉంటే ఆ రాజ్యం యొక్క మూలం బలమైనదని చెప్పవచ్చు. మంచివారికి చెడ్డదిగా అనిపించే పనులు రాజు చేయకూడదు. ప్రజలకు అన్నివిధాలా మేలు కలిగించే పను లనే చేయాలి. ఎల్లప్పుడు వాటియందు శ్రద్ధ పెట్టాలి. ఈ విధంగా వామదేవుడు చెప్పిన బోధనలు రాజు వసుమనుడు అమలుచేసి ఇహపరాలలో కీర్తిని పొందాడు. అలాగే నీవు కూడా ఎల్లప్పుడు ధర్మాన్ని ఆచరించమ’ని భీష్మా చార్యుడు యుధిష్టిరునకు చెప్పాడు.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement