Monday, May 20, 2024

భక్తి సాధనం…దక్షిణాయనం

లోకంలోని మిగతా ప్రాణులతో పోలిస్తే… మనిషి భిన్నంగా ఉంటాడు. విభిన్నంగా ఆలోచిస్తాడు. వినూత్నంగా వ్యవహరిస్తాడు. తన అవసరాల కోసమే సృష్టి అంతా జరిగిందనీ, అన్నిటికీ తనే మూలమని భావిస్తాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దా న్ని చేరడానికి అనువైన మార్గాన్ని అన్వేషిస్తూ, ఆ క్రమంలో మన పూర్వీకులు కాలానుగుణం గా కొన్ని ఆచారాలు స్థిరీకరించారు. వేదాంగమైన జ్యోతిష శాస్త్రాన్ని ఆలంబనగా చేసుకున్నా డు. ‘జ్యోతిషామయనం చక్షు:’ అన్నారు. అంటే జ్యోతిషం వేదానికి కండ్ల వంటిదని చెప్పా రు. ధర్మాచరణకు జ్యోతిషం ప్రధానమైనది. దాని ఆధారంగానే కాలక్రమంలో జరిగే మా ర్పులకు అనుగుణంగా, సాధనకు వీలుగా ఋషులు మార్గనిర్దేశం చేశారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. జ్యోతిషంలో ఒక్కో గ్రహం రాశి మారటానికి ఒక్కో కాలవ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేషరాశి నుంచి వృషభ రాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 1/2 సం.లు పడుతుంది. రా హు, కేతువులకి 1 1/2 సం.లు, రవికి నెలరోజులు… ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశు లు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్తవు తుంది. సూర్యుడు ఏయే రాశుల్లో ప్రవేశిస్తే, ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. ‘సంక్రమ ణం’ అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని అర్ధం. సూర్యుడు ‘కర్కాటక సంక్రమ ణం’ చేశాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్ధం.
సాధారణంగా ఆషాఢ శుక్లపక్షంలోనే దక్షిణాయన ప్రవేశం జరుగుతుంటుంది. వ్యాస పౌర్ణమి గురుపూజతో సాధన ప్రారంభమవుతుంది. ‘శ్రావణ: శివ రూపక:’ అంటుంది శా స్త్రం. శివరూపమైన శ్రావణంలో శైవక్షేత్రాల్లో విశేష అభిషేకాలు జరుగుతాయి. ఈవిధంగా శ్రావణమంతా శైవోపాసన విశేషంగా కొనసాగుతుంది. తమ ఇంట్లోనే సంబరంగా కృష్ణాష్ట మి వేడుకలు జరుపుకొంటారు. స్త్రీలు ఆచరించే మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, అన్నద మ్ముల మేలుకోరి చేసే నాగులపంచమి, రక్షాబంధన్‌ ఉత్సవాలు ఆనందాలుపంచుతూనే భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి. ఉపనయన సంస్కారం ఉత్తరాయణంలో చేసినప్పటికీ శ్రావ ణ పౌర్ణమినాడు ఉపాకర్మ చేస్తారు. అలా దక్షిణాయనంలోనే వేదాధ్యయనం ఆరంభమవు తుంది. భాద్రపద శుక్ల చతుర్థి వినాయక చవితి. ఈనెలలోనే అనంత చతుర్దశి, వామన జయంతి పర్వదినాలూ ఆధ్యాత్మిక శోభను పంచుతాయి. ముఖ్యంగా రుణ త్రయాల్లో ఒకటైన పితృ రుణ విముక్తికి భాద్రపద కృష్ణ పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృతర్పణాలు నిర్వహంచడం సంప్రదాయం.
శాక్తేయులు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి వివిధ రూపాల్లో, వివిధ సంప్రదాయాల్లో అమ్మవారిని సేవిస్తారు. మన రాష్ట్రంలో శ్రీ చక్రస్వరూపిణి అయిన జగన్మాతను పూలతో బతుకమ్మగా పేర్చి పదిరోజులపాటు ఆటపాటలతో ఆరాధిస్తారు. ఆశ్వయుజ అమావాస్య దీపావళి ఉత్సవమూ భక్తి ప్రధానమైనదే. దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి, లక్ష్మీపూజలు విశేషంగా చేసుకుంటారు. మొత్తంగా ఆశ్వయుజం శక్త్యుపాసనకు ప్రధానం.
కార్తిక మాసం శివకేశవుల మాసంగా చెబుతారు. ఈనెలలో అభిషేకాలతో శివుడిని కొలి స్తే, అర్చనలతో దామోదరుడిని సేవిస్తారు. నిత్య రుద్రాభిషేకాలు, కేదారేశ్వర వ్రతాలు, వన భోజనాలు ఇలా కార్తిక మాసమంతా భక్తి ఉద్యమంలా సాగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ‘మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణుడు స్వయంగా తానే మార్గశిర మాసమని భగవద్గీతలో పేర్కొన్నాడు. ఈనెలలో విష్ణు ఉపాసన విశేషంగా కొనసాగుతుంది. అంతేకా దు, కార్యవిముఖుడైన అర్జునుడిని ఉద్ధరించడానికి కృష్ణ భగవానుడు గీతోపదేశం చేసిన మహత్తరమైన మాసం కూడా ఇదే. అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్త మానవజాతికీ భగవంతుడు ఇచ్చిన సందేశమే ‘భగవద్గీత’. మార్గశిర శుద్ధ షష్ఠినాడు ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ చేసుకుంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహంచి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహా రం చేసిన పర్వదినం ఇదే. యోగ సాధనలోని షట్చక్రాలకు షణ్ముఖుడి ఆరు ముఖాలూ ప్రతీ కలుగా చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేసే ‘ప్రావరణ వ్రతం’ నిర్వహంచే సంప్రదాయమూ ఉంది.
ప్రతి రోజూ అందరూ దర్శించుకునే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఉత్తరాయణం లో ప్రచండంగా ఉండే భానుడి ప్రభావం దక్షిణాయణం కొనసాగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే మనుషుల్లో రోగనిరోధక శక్తీ తగ్గుతుంటుంది. అందుకే, ఈ ఆరుమాసా లు మన పెద్దలు పలు వ్రతాలు, పండుగలతో జీవన విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఈ కాలంలో సూర్యోపాసన విశేష ఫలితాన్ని ఇస్తుంది. నిత్యం సూర్య నమస్కారాలు చేయడం ఆరోగ్యానికీ మేలుచేస్తుంది.
ఈ దక్షిణాయణంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఈకా లంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదల కు దైవశక్తి సాయం ఎంతో అవసరం.
అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈకాలంలో ఉపాసనలు, యజ్ఞాలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయినది. శాస్త్రీయంగా దక్షిణాయణం లో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారినపడతారు. వీటిని నిరోధించడానికి ఈకాలంలో బ్రహ్మచర్యం, ఉపాసన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగ నిరో ధకశక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయణం రాత్రిగా చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయణం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. దక్షిణా యణంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాల నుండి విముక్తి కలిగి స్తాయి. దక్షిణాయణంలో దేవతా ప్రతిష్ఠ, గృహప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాం టి శుభకార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయణంలో ఉగ్రదేవతా రూ పాలను అంటే సప్తమాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహషాసురమర్దని, దుర్గలాం టి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహత చెబుతోంది. కర్కాటక సంక్రమ ణ సమయంలో అంటే దక్షిణాయణ ప్రారంభంలో పుణ్యస్నానాలు, జపతపాలు చేయడం తోపాటుగా, కుల దైవాన్ని, లేదా శ్రీమహావిష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి, దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. వారి పితృదే వతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.
ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయణం ప్రతీకలుగా భావిస్తారు. మనందరము కూడా నేటి నుండి ప్రారంభ మవుతున్న దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావితరాలకు మన సం స్కృతిని తెలియజేద్దాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement