Monday, April 29, 2024

భృగు మహర్షి భగవదాన్వేషణ!

వరుణ మహర్షి కుమారుడు భృగు ఒకసారి తండ్రిని ”భగ వంతుడు అంటే ఎవరు?” అని ప్రశ్నించాడు. అంత వరుణ మహర్షి తపస్సు చేసి సత్యాన్ని తెలుసుకోమని సూచించాడు. అంటే భగవంతుని తనకు తానుగా తెలుసుకోవడమే ఉత్తమ మార్గం అని ఆయన అభిప్రాయం. అయినా కుమారుని ఉత్సాహం చూసి కొంత వివరణ ఇచ్చాడు. ”ఆహారం, ప్రాణం, కన్ను, చెవి, మనస్సు, వాక్కు” ఇవే భగవంతుడు. ఎవరి నుండి ఈ సమస్త ప్రకృతి, జీవజాలం జనించుచున్నదో ఆయనే భగవంతుడు. సమస్త విశ్వానికి ఆధార భూతమైనవాడు భగవంతుడు. నీవు తపస్సు ద్వారా ఇంకా వివరంగా తెలుసుకోగలవని తెలిపాడు. తపస్సు అనగా మనస్సును, ఇంద్రియాలను వశం చేసుకోవడం, అంతర్ముఖమై నిన్ను నీవు తెలుసుకుని, భగవంతుని గురించి తెలుసుకోవాలి అని సూచించాడు.
తండ్రి సూచనలను గ్రహించి తపస్సు చేయనారంభించాడు భృగు. మెల్లమెల్లగా అంతర్ముఖుడై ఒక్కొక్క సత్యాన్ని ఈ విధంగా తెలుసుకోనారంభించాడు. ఆహారమే భగ వంతుడు. ఆహారం నుం డే జీవజాలం ఉద్భవిస్తోంది. దానితోనే జీవిస్తున్నాయి. తిరిగి మర ణానంతరం దానిలోనే లీనం అయిపోతున్నాయి. ప్రాణమే భగవంతుడు. ప్రాణం లేకుండా జీవులు జీవించే అవకాశంలేదు. మరణించిన తరువాత ప్రాణంలో లీనమవుతున్నాయి. కావున ప్రాణమే భగవంతుడని లోతుగా తపస్సు చేయడం కొనసాగించాడు భృగు.
మనస్సే భగవంతుడు. మనస్సు అనే పదార్థం నుండే జీవజా లం జనిస్తోంది. మనస్సు వలన అవి జీవించగలుగుతున్నాయి. మరణానంతరం తిరిగి మనస్సులోనే లయమవు తున్నాయి. సంతృప్తి చెందని భృగు తపస్సులో అన్వేషణ కొనసాగించాడు.
బుద్ధే భగవంతుడు కావచ్చు. ఎందుకంటే బుద్ధి వల్ల విచక్షణతో జీవులు ఉద్భవించా యి. తిరిగి విచక్షణతో బుద్ధిలోనే లయం చెందుతున్నాయి అని భావించాడు. తిరిగి తపస్సు కొనసాగించాడు. ఆనందమే భగవంతుడు కావచ్చు. ఎందువలనంటే ఆనందం నుండే సమస్త జీవులు జనిస్తున్నాయి. ఆనందం వలననే జీవించగలుగుతున్నాయి. తిరిగి ఆనం దంలోనే లయం చెందుతున్నాయి. చివరకు తండ్రి వరుణ మహర్షి మార్గదర్శకత్వంలో తపస్సులో భార్గవీ- వారుణీ విద్యను సాక్షాత్కరింప చేసుకున్నాడు.
ఈ విద్య తపస్సు ద్వారా శ్రేష్ఠమైన హృదయంలో నెలకొని ఉంటుంది. హృదయాకా శంలో ప్రకాశించే ఆత్మలో ఈ విద్య స్థిరమై ఉంటుంది. యీ భార్గవీ-వారుణీ విద్యను పొం దినవాడు ఆహార సమృద్ధి గలవాడై చక్కగా భుజించి ఆనందిస్తాడు. సంతానవంతుడై బ్రహ్మ తేజస్సు, కీర్తి గలవాడు అవుతాడు. హృదయంలో ఆత్మను తెలుసుకుని భగవంతుని కొరకు తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ దేహం భగవంతుడు కాదని ఆత్మ ద్వారా తెలుసు కోవాలని గ్రహిస్తాడు. తాను ఆత్మ స్వరూపుడను అని తెలుసుకొన్నవారు సమస్త లౌకిక సంప దలను చాలా అవలీలగా లభ్యం చేసుకోగలరు. ఫలాపేక్ష రహితమైన ఆత్మభావన వలన దేని నైనా సాధించగలరు. అదే సమయంలో సమస్తము పంచి పెట్టగలరు.
ఈ భగవత్‌ చింతన జీవితాన్ని పరిపుష్టం చేస్తుందని గ్రహించాడు భృగు. భగవంతుని అన్వేషించే క్రమంలో పరిపుష్టమైన జీవన క్రమం విశదమవుతుంది.
ఆహారాన్ని నిందించకూడదు. ప్రాణమే ఆహారం. దేహ ప్రాణాలు పరస్పర ఆధారాలు. అలాగే ఆహారం, ఆహారంలోనే నెలకొని ఉంది. ఆహారాన్ని భగవంతుని అనుగ్రహంగా భావించాలి. భగవంతునికి నివేదన చేసి మాత్రమే భుజించాలి. ఆహారాన్ని సాత్వికంగానే భుజించాలి. సాధ్యమైనంత వరకు ప్రకృతి సిద్ధంగానే ఉండాలి. దేహం, ప్రాణం, ఆహారం ఈ మూడు పరస్పర ఆధారాలు కావున ఆహారాన్ని స్తుతించాలి. మితంగా భుజించాలి. ఆహా రాన్ని ఉపేక్షించకూడదు. నీరు, అగ్ని, ఆహారం ఒకదానితో ఒకటి మిళితమై ఉంటాయి.
దేహాన్ని పోషించేది ఆహారం కనుక దానిని మితంగా భుజించాలి. ఆహారాన్ని విస్తారం గా ఉత్పత్తి చేయాలి. భూమియే ఆహారం, ఆహారమే భూమి. ఈ సమస్త విశ్వం ఆకాశానికి ఆహారం. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వాలి. ఇక్కడ ఆహారం సిద్ధంగా ఉంది అని చెప్పగ లిగే సమాజమే స్వర్గం.
భగవత్‌ చింతనలో జీవించడం, వాక్కులో క్షేమకరంగాను, ప్రాణాపానములలో యోగక్షేమములతోను, అన్ని అవయవాలలోను భగవంతుని చైతన్యం పనిచేయుచున్నదని తెలుసుకోవాలి. కావున మాట్లాడే మాటలు, చేసే చేతలు, సమాజహితంగా ఉండాలి.
వర్షంలో తృప్తిగాను, మెరుపులో శక్తిగాను, నక్షత్రాలలో కాంతిగాను, జననేంద్రియాల లో సంతానోత్పత్తిగాను, ఆకాశంలో సమస్తంగాను భగవంతుడు ఉన్నాడు. మనిషి సమా జంలో భాగం. మంచి, చెడు సమాజంలో ఎల్లప్పుడూ నడుస్తూ ఉంటాయి. ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలు పరిస్థితిని బట్టి ఒక్కొక్కొసారి మారుతూ ఉంటాయి కూడా! ఎం డాకాలంలో నిప్పు మనకు రోత పుట్టిస్తుంది, కాని శీతాకాలంలో సుఖం చేకూర్చుతుంది. ఎడతెరిపి లేని వర్షం చికాకు కలిగిస్తుంది. కానీ అనావృష్టిలో అదే వర్షం అమృత తుల్యం అవుతుంది. కావున మంచి చెడు అనేవి విచక్షణతో నిర్ణయించుకోవాలి. సమాజం, ప్రకృతిలో ని ప్రయోజనకరమైన అంశాలను స్వీకరించి సమాజ శ్రేయస్సుకు దోహదపడేలా మనిషి ప్రయత్నించాలి. ఇదంతా భగవంతుని మహత్వం నుండే అభివ్యక్తమవుతాయి.
ఈ విధమైన చింతనను భృగు తపస్సు ద్వారా గ్రహించాడు. అంతిమంగా ఈ సత్యా న్ని వ్యక్తపరచాడు. పరబ్రహ్మం సమస్తమునకు ఆధారభూతుడు. అందువలన నిత్యం స్తుతించాలి. అలా స్తుతించేవారే మహత్వం పొందుతారు. వారికి కోరినవన్నీ లభిస్తాయి. మనిషిలో ఉన్నవారు సూర్యునిలో ఉన్నవారు ఒక్కరే. ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్నవా రు. కోరిన రూపాన్ని పొందుతారు. కోరిన లోకాలకు చేరి సంచరిస్తారు. నిత్యానందులై వెలు గుతారు. భగవంతుడు సమస్తంలోను విస్తరించి ఉన్నాడు అనే విషయం తపస్సు ద్వారా అంతర్ముఖుడై తనలోని భగవంతుని ద్వారా తెలుసుకున్నాడు. వరుణ మహర్షి పంచేంద్రి యాలు, పంచప్రాణాలు, పంచభూతాలు వీటన్నింటినీ భగవంతుడు ఆక్రమించి ఉన్నాడనే విషయాన్ని తపస్సు ద్వారా తెలుసుకోమని కుమారుడు భృగుకు పరోక్షంగా సూచించాడు.
భగవంతుని చింతనతో జీవించడమే భగవంతుని తెలుసుకోవడమని తెలియచేసాడు. ముఖ్యంగా వాక్కు అనగా మనం మాట్లాడే మాటలు మంగళకరంగా ఉండాలి. చేసే పనులు సర్వశ్రేయోదాయకంగా ఉండాలి. అప్పుడే భగవంతుడు మీనుండి అభివ్యక్తమవుతాడు. ఈ ప్రకృతిలో ఏదీ అసహ్యించుకొనేది లేనే లేదు. అన్నీ హితమైనవే! అందుకే సమస్తం భగవం తుని స్వరూపమని తైత్తిరీ ఉపనిషత్తులోని భృగువల్లిd విశదీకరించింది. భగవంతుడు సర్వమంగళకరుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement