Tuesday, May 7, 2024

సుగ్రీవుడి పట్టాభిషేకం రామకార్యానికేనా

వాలి, సుగ్రీవులు యుద్ధం చేస్తుంటే దూరం నుండి రామచంద్ర మూర్తి వేసిన బాణం తాకిడికి మూర్ఛ వచ్చి వాలి నేల కొరి గాడు. అంతకుముందే సుగ్రీవుడు కొట్టిన దెబ్బలకు వాలి కీళ్లు బాగా నొప్పి కలిగించాయి. దానికి తోడు, రామ బాణం మేకులాగా శరీరా నికి గుచ్చుకుంది. ఈ కారణాన కాళ్లలో బలం పోయి కదిలించలేక, విలవిల్లాడాడు. కిష్కింధలో వున్న తారకు తన మగడు చనిపోయా డన్న వార్త తెలిసింది. వాలిని చూడాలన్న కోరికతో కొడుకుతో సహా వచ్చింది. కిందపడిపోయిన భర్త పాదాల దగ్గరకు వెళ్లాలనుకుంది.
వాలిని దూరం నుండే చూసి, బాధతో నడవలేక- నడవలేక, వాలిని సమీపించిన తార వాలిని, శ్రీరాముడిని, పక్కనే వున్న లక్ష్మ ణుడిని, ఈ పనంతా వారితో చేయించిన సుగ్రీవుడిని చూసింది. వాలిని సమీపిస్తూనే, మూర్చిల్లి, నిలబడి, గాఢనిద్ర నుండి లేచిన దానిలాగా ”ప్రియనాథా! మనోహరా!” అని ఏడ్చింది. శోకదేవత లా వున్న వదినను, చావడానికి సిద్ధంగా వున్న అన్నను, సుకుమా రుడైన బాలుడు అంగదుడిని చూసిన సుగ్రీవుడు దు:ఖంతో కన్నీళ్లు కార్చాడు. తార అక్కడే వున్న కొడుకు అంగదుడిని చూసి, ”కుమా రా! ఇక్కడికిరా. ధర్మప్రీతికల నీ తండ్రిని కరువుతీరా చూడు. ఇదే కడసారి చూపు. ఇకమీద నీ తండ్రిని నువ్వు చూడాలనుకున్నా ఆ అదృష్టం రాదు. ఇంక ఎవరిని నువ్వు నాయనా అని పిలుస్తావు?”
అలాగే వాలిని ఉద్దేశించి, ”ఇదిగో, వీడే అంగదుడు. చూడు. ముద్దుగా పెరిగాడు. నీ ఎదుట మాట్లాడడానికే భయపడతాడు. అలాంటప్పుడు, కోపం కల పినతండ్రికి సేవ ఎలా చేస్తాడో? చేయ కపోతే ఏమవుతుందో? వానరేశ్వరా! కళ్ళు తెరిచి చూడు నీ కొడు కుని. ఎందుకేడుస్తున్నావని సమాధానపర్చు. నిన్ను చంపి రామభ ద్రుడు గొప్ప పనిచేశాడు. అదేంటంటావా? సుగ్రీవుడికి చేసిన ప్ర మాణం సార్ధకం చేసుకున్నాడు. (సుగ్రీవుడిని చూసి) సుగ్రీవా! విరోధంపోయేట్లు అన్నను చంపావు. ఇక రుమతో, రాజ్య రమతో సుఖపడు. (మళ్లి వాలిని చూసి) నీ ప్రియురాళ్ళందరూ ఇక్కడ ఏడుస్తున్నారు. వాళ్లతో ఒక్కమాట మాట్లాడకూడదా?” అంది.
అలా ఏడుస్తున్న తారతో హనుమంతుడు ”దేవీ ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా కర్మకు తగ్గ ఫలితం అనుభవించక తప్ప దు. పుణ్యకర్మకు శుభం, పాపకర్మకు కీడు కలిగించడానికి వారి వెం ట పరలోకానికి పోవడం జరుగుతుంది. అలాగే వాలి కూడా తన శుభాశుభ కర్మఫలం అనుభవించడానికి పోయాడు. నువ్వు సుగ్రీవు డిని, రాముడిని నిందించాల్సిన అవసరం లేదు. వారు నిమిత్తమా త్రులే. నీ కొడుకు అంగదుడు బాలుడు. వాడు జీవించి వున్నాడు. అలాంటి వాడిని నువ్వు కాకుండా మరెవ్వరు రక్షిస్తారు?”
”వాలి కొరకు ఎందుకు ఏడుస్తున్నావు? అతడు లోకంలో చేయాల్సినవన్నీ చేసి లోకాన్ని వదిలాడు . అంగదుడికి, కపి శ్రేష్టుల కు, భల్లూక శ్రేష్టులకు, కపిరాజ్యానికి నువ్వే దిక్కు. సమస్త భారం నీ మీదే వుంది. ఏడవకు. క్రమక్రమంగా నీ సహాయంతో నీ కొడుకు రాజ్యం చేయడం నువ్వు చూసి సంతోషిస్తావు. ఇలా దు:ఖ పడ వద్దు. భవిష్యత్‌లో మీకు ఏ కష్టంరాదు. వర్తమానంలో జరగాల్సిం ది ఆలోచించు. నీ కొడుకును తండ్రికి ఉత్తరక్రియలు చేయనివ్వు. ఆ తర్వాత అతడి రాజ్యాన్ని స్థాపించి దు:ఖం పోగొట్టుకుంటావు”.
ఇలా వీళ్లు మాట్లాడుకునే సమయంలో కొంచెం ఊపిరికల వాలి మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ కళ్లు విప్పి, తన దగ్గర వున్న అంగదుడిని, అతడి సమీపంలో వున్న సుగ్రీవుడిని చూసి, స్నేహ పూర్వకంగా ఇలా అన్నాడు. ”సుగ్రీవా! నీమీద పగ సాధించానని నన్ను దూషించవద్దు. నీలో ఏ దోషం లేదు. ఇదిలా జరగాలని వుం డడం వల్ల నా ఫలం నన్ను బట్టుకుని యీడ్చి, బలవంతంగా జ్ఞాన హీనుడిని చేసింది. అన్నదమ్ముల మర్యాద ప్రకారం మనం ఒక్కటి గా వుండలేకపోయాం. తమ్ముడా! ఇది దైవం చేసిన పని. దాన్ని తప్పించడం మన శక్యమా? ఇక నేను జీవించలేను. ఈ వానర రాజ్యాన్ని నువ్వు సంతోషంగా పాలించు. ప్రాణం- రాజ్యం, సంప ద, భూమ్మీద మూడులోకాల పొగడ్తలు కన్న ఎక్కువ. దాన్ని వదిలి స్వర్గానికి పోతున్నాను” అని అంటూ అంగదుడిని, తారను సుగ్రీవు డికి అప్పచెప్పాడు వాలి. తన మెడలోని బంగారు హారాన్ని సుగ్రీవు డికి ఇచ్చి ధరించమన్నాడు. సుగ్రీవుడు తన మనస్సులో అన్న మీద వున్న విరోధం, రోషం వదిలి శాంతించి, బంగారు సారాన్ని తీసుకు న్నాడు. తరువాత కొడుక్కి రకరకాలుగా నీతి, ధర్మం బోధించాడు.
ఈవిధంగా చెప్పి, బాధపడుతూ, గుడ్లు గిరగిరా తిప్పుతూ, నోరు తెరిచి వాలి ప్రాణాలను విడిచాడు. కోతి గుంపులన్నీ హా! హా! అని ఏడ్చాయి. ప్రభువు చనిపోగా కిష్కింధ పాడుబడినట్లు కాంతి హనమైంది. కొండలు, తోటలు, గు#హలు, పూర్వం ఉన్నట్లుగా కా కుండా పాడుబడినట్లు అయిపోయాయి. ఆవుల మందకు రక్షణగా వున్న ఆబోతు చస్తే రక్షణ చెడ్డ ఆవులు భయంకరమైన సింహాలు వుండే అడవిలో దుర్భలులై ఘోషిస్తున్నట్లు వానరులు వాలి కొరకై ఏడ్చారు. మరణించిన భర్త ముఖం చూస్తూ శోకసముద్రంలో మునిగి మగడిని కౌగ లించుకుని తార నేలమీద పడింది.
ఇలా తార ఏడుస్తుంటే నీలుడు వచ్చి వాలి రొమ్ములో వున్న రామబాణాన్ని లాగాడు. దాంతో వానర శ్రేష్టుడి గాయాల నుండి నెత్తురు కాలవల్లాగా పారింది. అప్పుడు తార వాలి శరీరం మీద వున్న ధూళిని, తన కన్నీటి ధారలతో సర్వావయాలను కడిగింది. అంగదుడిని దగ్గరకు తీసుకుని వాలిని చూపించి, ”నీ తండ్రిని కళ్లా రా చూశావా? పాపకార్యంవల్ల కలిగిన విరోధం ఈ రోజుతో దేహం తో వదిలాడు. కుమారా! ఇదే కడసారి, ఇక నీ తండ్రి ముఖం నువ్వు చూడబోవు. కాబట్టి మొక్కు. బాల సూర్యుడులాంటి దేహం కల వాడు ఒక్కడే యమపురికి పోతున్నాడు”. అని చెప్పింది. తల్లి అలా చెప్పగా, అంగదుడు వాలి పాదాల మీద పడి, ”తండ్రీ! నేను అంగ దుడిని. నమస్కరిస్తున్నాను. అంగీకరించు” అన్నాడు.
అంగదుడు, తార, ప్రాణం పోయి అన్న నేలమీద పడివుండ డం చూసిన సుగ్రీవుడు తానే దీనంతటికీ కారణమని బాధపడ్డాడు. మెల్లగా శ్రీరాముడుని సమీపించి ”నువ్వు అన్న ప్రకారం నీమాట చెల్లించుకున్నావు. కపిరాజ్యం నాకు లభించింది. కాని రాజ్య సుఖా ల మీద, ప్రాణం మీద ఆశ నశించిపోయింది. దు:ఖం ఆపుకోలేక పోతున్నాను” అన్నాడు. ఆ మాటలకు రాముడు సుగ్రీవుడిలాగే తానూ కళ్ళనీళ్ళ పర్యంతమై కొంచెంసేపు దు:ఖపడ్డాడు. తార దగ్గ రకు పోయి ఆమెను ఓదార్చాడు. రాముడి ఓదార్పు మాటలకు తార దు:ఖం మానింది.
దీనికే కరుఱ రసం అని పేరు. పరుల దు:ఖం తన దు:ఖంగా భావించి దు:ఖపడడమే కరుణ లక్ష్యం. ఈ అవతారంలో ఈ రసం విశేషంగా కనిపిస్తుంది. సీతకొరకు రాముడు ఏడ్చింది ఇలాంటి కారణం వల్లే. ఇది దొంగ ఏడ్పు కాదు. మాయ అంతకంటే కాదు. నిజమైన దు:ఖం. ఇలాంటి కరుణ కలవాడు కాబట్టే రామచంద్ర మూర్తికి కరుణాకాకుత్థ్సుడని బిరుదు వచ్చిం ది. ఆశ్రితుల దు:ఖం కొంచెమైనా స#హంచలేడు. ఇది భగవంతుడిలో కల కళ్యాణ గుణా ల్లో ఒకటి. భగవంతుడు ఆశ్రిత వత్సలుడు. అందుకే దృఢంగా కావాలని ఎవ్వరేది కోరినా అనుగ్ర#హస్తాడు. కాని, చెడ్డ కోరికలు కల వారు ఫలితాన్ని అనుభవించేటప్పుడు దు:ఖపడుతుంటే, అయ్యో! వీరిలాంటి పాపపు కోరికలు కోరి దు:ఖ పడుతున్నారే, వీళ్లెప్పుడు బాగుపడతారా? అని వారిలాగే తానూ దు:ఖపడతాడు.
ఆ తరువాత సుగ్రీవుడు సహాయంతో అంగదుడు తన తండ్రికి చితి పేర్చి, వానర శ్రేష్టుడి చితిమీద అగ్నిని వుంచాడు. అప్రదక్షిణం గా తిరిగాడు. వాలికి సంస్కారాలు చేసి శాస్త్ర పద్ధతిలో నదిని చేరి తార, సుగ్రీవుడు అంగదుడితో కలిసి వాలికి నీళ్లు వదిలారు. సుగ్రీ వుడితో ప్రేతకర్మలు జరిపించారు. తర్వాత సుగ్రీవుడు రాముడి దగ్గ రకువచ్చాడు. మిగిలిన వారంతా కిష్కింధకు వెళ్ళారు.
తడిబట్టలతో, దు:ఖభారంతో, బాధపడుతున్న సుగ్రీవుడిని మంత్రులంతా సేవించారు. అందరూ కూర్చున్న తరువాత హను మంతుడు రామచంద్రమూర్తితో ”రఘుకుల దీపకా! నువ్వు సమ్మ తిస్తే సుగ్రీవుడు కిష్కింధ చేరి దివ్యౌషధులతో పవిత్ర స్నానం చేసి వానరులతో మిగిలిన పట్టాభిషేక కార్యక్రమం జరిపిస్తాడు. ఆయన కు మీరు పట్టాభిషేకం చేసి ఈ వానర సమూహాలకు సంతోషం కలి గించు” అన్నాడు. రాముడు ఆంజనేయుడితో సుగ్రీవుడు వూరికి చేరి పట్టాభిషిక్తుడై శాస్త్రవిధి తప్పకుండా వానర రాజ్యాన్ని పాలిం చాలని చెప్పి, సుగ్రీవుడితో ”ఈ అంగదుడికి యువరాజుగా పట్టాభి షేకం చేయి. ఇతడికి ¸°వరాజ్యం ఇవ్వడం సబబే. నిన్ను కిష్కింధ కు పోయి పట్టాభిషేకం చేసుకోమంటే నా పని మరిచానని కాదు. దానికి సమయం ఇదికాదు. వానాకాలంలో మొదటిది శ్రావణ మాసం. అది మొదలు నాలుగు నెలలు వర్షాకాలం. దం డయాత్ర కు పనికిరావు. కాబట్టి నీ వూరికి పో. నేను, లక్ష్మణుడు ఈ గుహలో వుంటాం. కార్తీక మాసం రాగానే రావణ వధకు కావాల్సిన ప్రయ త్నాలు, వానర సేనను పోగు చేయాలి. నువ్విప్పుడు వూరికి వెళ్ళి నీ స్నేహితులు సంతోషించే విధంగా రాజువై సుఖపడు”.
రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి సంకేతం ఇచ్చినట్లే అని సుగ్రీవుడు భావించి కిష్కింధకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు వానర గుంపులు, పౌరులు, సాష్టాంగ నమస్కారం చేశారు. తన అన్న అం త:పురానికి పోయి, దు:ఖపడుతున్న తారను సమాధానపరిచాడు. తరువాత బక్ష్యాలతో, మణులతో, వస్త్రాలతో, బ్రాహ్మణులను తృప్తి పరిచారు. తదుపరి, దర్భలు పరిచిన భూమ్మీద అగ్నిని నిలిపారు. పవిత్ర మంత్రాలతో హూమాలు చేయించి, మంత్రాలు తెల్సిన వారు చిత్రమాల్యాలతో ప్రకాశించే మేడలో మనోహరమైన బంగా రు పీటమీద తూర్పు ముఖంగా సుగ్రీవుడిని నిలబెట్టారు. అనేక నదుల నుండి, ఉపనదుల నుండి, సముద్రం నుండి జలాలను తెచ్చి, బంగారుకుండలో పోసి, బంగారు పాత్రలను ఎద్దుకొమ్ము లతో ఆ నీళ్లలో ముంచారు. ఆ తరువాత శాస్త్రంలో చెప్పినట్లు మైం దుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, గజుడు, గవాక్షుడు, గవ యుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలభుడు, శరభుడు సంతోషంగా సుగ్రీవుడిని, ఇంద్రుడిని అభిషేకించినట్లు మిక్కిలి సువాసన కల మంచినీటితో ప్రేమతో అభిషేకించారు. సుగ్రీవుడు సంతోషంగా పట్టాభిషిక్తుడై సుగ్రీవుడు ఆ తరువాత అంగదుడిని యువరాజుగా అభిషేకించగా అందరూ సంతోషించి, సుగ్రీవుడిని పొగిడారు.
ఇప్పుడు కిష్కింధ అని చెప్పబడే ప్రదేశాన్ని చూస్తే, అదొక చిన్న పట్టణంలాగా కనపడుతుంది. కాని, వాలి- సుగ్రీవులు పాలిం చినది ఆ చిన్న పట్టణం కాదు. కిష్కింధా రాజ్యం అల్ప రాష్ట్రం కానే కాదు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement