Monday, April 29, 2024

సింహాద్రినాధుడికి శ్రీచందనం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో:ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసిం హస్వామి నిజరూపదర్శనం ఉత్సవాన్ని మే 3న ఘనంగా నిర్వహించ నున్నారు. ప్రతీ ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది పొడవున సుగందభరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనోత్సవంగా , చందనయాత్రగా పిలవడం జరుగుతుంది. చందనోత్సవం రోజు ఉదయం నుంచి భక్తులకు స్వామిదర్శనం కల్పించి రాత్రికి వివిధ రకాల ఫల,పుష్ప, శీతలాదులతో కూడిన సహస్రఘ టాభిషేకం నిర్వహించి అదే రోజు రాత్రికి స్వామికి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు.
ఘనంగా తొలివిడత చందనం అరగదీత ప్రారంభం
సింహాద్రినాధుడి ఆలయంలో మంగళవారం చైత్రశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తొలివిడత చందనం అరగదీత ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారు జామునే సింహాద్రినాధుడిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలుతో అభిషేకం జరిపారు. తదుపరి స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ ఆధ్వర్యంలో ఆలయ బాండాగారం నుంచి చందనం చెక్కలను బయటకు తీసి వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ ఆలయ బేడా మండపం చుట్టూ వాటితో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో చందనం చెక్కలకు తొలుత విశ్వక్షేణ, పుణ్యహవచనం, ఆరాధన గావించి శాస్త్రోక్తంగా తొలి చందనం చెక్కను ఆలయ ఇన్‌ఛార్జి ప్రధాన అర్చకులు ఇరగవరపు వెంకటరమణమూర్తి ఆచార్యులు అరగదీశారు. ఇలా అరగదీసిన చందనాన్ని స్వామి పాదాల చెంత ఉంచి అర్చన గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు , అలంకార్‌ కరి సీతారామాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహిం చగా ఆలయ ఇన్‌ఛార్జ్‌ఒ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ప్రసాదాచార్యులు, అప్పాజీ తదితరులంతా ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకులు పాలూరి నరసిం గరావు, రాజా, అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజు, దొడ్డిరమణ, సంపంగి శ్రీనివాసరావు, సతీష్‌, పాత్రుడు, శ్రీదేవి, వంకాయల నిర్మల, చందుయాదవ్‌ తదితరులంతా పాల్గొని చందనం అరగదీసి స్వామిని సేవించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement