Tuesday, May 21, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 7

7. దివిజక్ష్మారుహధేనురత్నఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
నువు నీ విల్లు, నిధీశ్వరుండు సఖుడర్ణోరాశికన్యావిభుం
డు విశేషార్చకు డింక నీ కెన ఘనుండున్ గల్గునే నీవు చూ
చి విచారింపవు లేమి నెవ్వడుడువున్ శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, మొదలైన గొప్ప ఐశ్వర్యప్రదములైన వస్తువులచే ఒప్పు మేరుపర్వతము నీ విల్లు. ధనాధిపతి అయిన కుబేరుడు నీ సఖుడు. సమస్త సంపదలకు నిలయమైన సముద్రరాజపుత్రి అయిన లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు నీ భక్తులలో శ్రేష్ఠుడు. మఱి, ఇంక నీకు సాటి అయిన వాడు ఇంకెవరు? అయి ఉండి కూడా నీ భక్తుల దారిద్ర్యాన్ని ఎవరు పోగొడతారు? అని ఆలోచన చెయ్యవు. పై వారిలో అందరూ దారిద్ర్యమును పోగొట్టి సంపదల నీయగలవారే. కాని, నీవు ఆ విషయం గురించి ఆలోచించవు. నిజానికి వీరందరు బాహ్యమైన, భౌతికమైన దారిద్ర్యమును మాత్రమే పోగొట్ట గలరు. భగవదనుగ్రహము అను (లేక పోవటం అనే) దారిద్ర్యాన్ని పోగొట్టగల గలవారు ఈశ్వరుడు తప్ప మఱెవ్వరు లేరు.
సమస్తమైన ఐశ్వర్యప్రదాయకములైన వస్తువులు, మిత్రులు, భక్తులు, ఉండి కూడా శివుడు తన దారిద్ర్యము నెవ్వడు పోగొట్టునా? అని ఆలోచింపడు అన్నది ఈ పద్యమునకున్న మఱి యొక అర్థము.
విశేషం: కలిమి, లేమి మొదలైన ద్వంద్వములు మానవులకే కాని పరమాత్మకి కావు కదా! అందుకే ఆలోచన చేయడు. అంతే కాదు, ఐశ్వర్యం ఉండటం, లేక పోవటం అన్నది సాపేక్ష భావనాకి సంబంధించింది. నిరపేక్షమూర్తి అయిన పరమేశ్వరుడికి అది వర్తించదు. అయినా ఆ ఐశ్వర్యప్రదాయకములైన వాటికి అన్నింటికి ఆ శక్తిని ప్రసాదించినది తానే అయినప్పుడు వాటి నుండి తను అపేక్షించేది ఏముంటుంది? పరమేశ్వరుడి ఐశ్వర్యప్రదాన లక్షణం ( ఈశ్వరత్వం) ప్రతిపాదించ బడింది ఈ పద్యంలో.
త్రిపురాసురసంహార సమయంలో శివుడికి ధనుస్సుగా మారింది మేరుపర్వతం. ఈ పద్యం చదువుతు న్నప్పుడు ఆ ఐతిహ్యం మనసులో మెదలక తప్పదు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇది కూడా చదవండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 6

Advertisement

తాజా వార్తలు

Advertisement