Thursday, May 16, 2024

లంకిణి ఓటమి!

అసాధ్యమైన సముద్రాన్ని దాటి, త్రికూటపర్వత శిఖర మందున్న లంకను చూసిన తర్వాతనే హనుమంతుడి మనస్సు కుదుటపడింది. బహిరంగంగా తను తిరిగితే రాక్షసులు చూస్తారేమోనని ఉద్యాన వనంలోని చెట్ల చాటున తిరగసాగాడు.
హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటాడని రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. అయినప్పటికీ, ఇప్పు డు సముద్రమంత వెడల్పు లేదు కదా? రావణాసురుడి లంక ఇదే నా? అని కొందరు సందేహపడుతుంటారు. అయితే, కొన్ని బౌద్ధ ప్రామాణిక గ్రంథాలను చదివినవారికి ఈ అనుమానం నివృత్తి చేసుకునే ఆధారాలు లభ్యమవుతాయి. ఇంద్రజిత్‌ హోమం చేసిన ‘నికుంభిల’, సీతాదేవిని వుంచిన ‘అశోకవనం’ ఇప్పటికీ వున్నాయ క్కడ. ‘రావణ కోట’ అనే స్థలం వున్నదనీ, స్పష్టమవుతున్నది.
రామాయణంలో చెప్పబడ్డ ”త్రికూటం”, ”లంబపర్వతం”, ”సువేల” అనేవి లంకకు దక్షిణ భాగాన వున్నవే కాని, ఉత్తర భాగం లో లేవు. కాబట్టి ఇప్పటి లంకలోని ఉత్తర భాగం కూడా సము ద్రంలో మునిగే వుండాలి. లేదా హనుమంతుడు ఈ ప్రదేశాన్ని వదిలి అక్కడకైనా వెళ్ళుండాలి. ఈ పర్వతం చుట్టూ సముద్రము న్నదన్నాడు కాని, గ్రామాలున్నట్లు వాల్మీకి చెప్పలేదు. ”సువేల” అన్న పదమే సముద్ర తీరమన్న అర్ధాన్ని చెప్తోం ది. లంకలోని ఇప్పటి ఉత్తర రేవుకు, త్రికూ టానికి, మధ్య దూరం, నూరు మైళ్లకు పైనే వుంది. కాబట్టి హనుమంతుడు దాటింది రెండొందల ఏభై మైళ్ల ని తేలుతున్నది. అంటే నూరు యోజనాలు రెం డొందల ఏభై మైళ్లకు సమానం కావచ్చు.
సీతను దొంగిలించి తెచ్చిన రావణాసురుడు, ఆమెకు కాపలా గా విల్లు, బాణాలు ధరించి ఎల్లప్పుడూ తిరుగుతుండే రాక్షస శ్రేష్ఠు లుండే సమస్త ప్రదేశాలు కనిపించాయి. ఆంజనేయుడికి. శోభాయ మానంగా వున్న లంకను కొండ శిఖరాన్నుంచే చూసిన హనుమంతుడికది ఆకా శాన వున్న స్వర్గంలాగా గోచరించింది.
లంకను గెలవడం అసాధ్యమనిపిస్తుంది హనుమంతుడికి. శ్రీ రామచంద్రమూర్తి లంకకు వచ్చినప్పటికీ, రావణ రక్షణలో ప్రవేశించనలవికాని లంకానగరాన్ని ఏంచేయగలడన్న అనుమా నమేస్తుంది ఆయనకు. పోనీ, మనకు విరోధమెందుకు? సీతను అప్పగించమని మంచితనంగా సామ, దాన, భేద, దండోపాయా లు కూడా పనికి రావేమో అనుకుంటాడు. ఇప్పుడు తాను చేయ వలసిన పని సీతను వెతకడం, దానికి లంకలో ఎలా ప్రవేశించాలని యోచించడమనుకుంటాడు. లంకకు పోయే మార్గమేంటని ఆలో చిస్తాడు. బహిరంగంగా లోపలికి వెళ్లడం మంచిదికాదు. తెలవ కుండా లోపలికి పోయి, కనపడవలసిన చోట కనపడుతూ, కన పడరాని చోట కానరాక వుండే రీతిలో వేషాలు మార్చాలనుకుం టాడు ఆంజనేయుడు. మొత్తం మీద చీకటిమాటున కార్యం చక్క బర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
”ఏవిధంగా చేస్తే నా ప్రయత్నం సఫలమౌతుంది? పగటి వేళ ప్రవేశించాలా? రాత్రి వేళా? ఈ రూపంలోనా? రూపం మార్చా లా? ఈ క్షణమే ఈ రూపంతోనే వెళ్లాలా? అలా వెళితే రాక్షసుల కంటబడితే, రామకార్యం, సీతాదేవిని వెతకడం చెడిపోతుంది కదా? రాక్షస రూపంలో పోవాలా? లంకలోని వారందరూ ఒకరి కొకరు తెల్సిన వారే కదా? కొత్తవాడినైన నన్ను గుర్తించరా? ఇంకో రూపంలో పోయినా వారు తెలుసుకోవచ్చు కదా? ఈ రాక్షసులకు తెలియకుండా గాలి కూడా లంకలో సంచరించలేదు కదా!” అని హనుమంతుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. చీకటిపడే వరకు ఇక్కడే దాక్కొని, ఆ తర్వా త చిన్న కోతిగా మారి, రావణుడి పట్టణంలో చొరబడి, సీతా దేవిని రాక్షసుల ఇళ్లలో వెతకాలి. అట్లయితే రామకార్యం చేసినవాడినన్న గౌరవంతో అతిశయించ గలనని ఆలోచించాడు #హనుమంతుడు.
సూర్యుడు అస్తమించగానే, పిల్లి ఆకారంతో, ”ప్రదోష” కాలం లో, లంకలో ప్రవేశించేందుకు, కొండ దిగి నడిచి రాకుండా, అక్కడి నుండే ఒక్క గంతేసాడు హనుమంతుడు. లంక రక్షణకై నియమించబడిన రాక్షసులను లంకా నగరం ప్రవేశిస్తూనే చూసా డు. లంకాపురిని ప్రవేశించడానికి లంబ పర్వతం పైనుండి దిగు తాడు #హనుమంతుడు. ఆయన దిగిన లంబ పర్వతమప్పుడు చీకట్లో వేలాడే పర్వతంలాగా వుంది. ఎంతో చిత్ర, విచిత్రంగా వుందే ఈ లంకానగరం! అనుకుంటాడు హనుమంతుడు. లంకా నగర సౌందర్యాన్ని చూసి, ప్రాకార సమీపాన్నుండి లంకానగరా న్నొక్కసారి తేరిపార చూస్తాడు. మనోహరమైన ఆ రావణుడి పట్ట ణాన్ని, దాని గొప్పతనాన్ని తిలకించి, సంతోషంతో దాన్ని గురించి అనుకుంటాడు హనుమంతుడు.
ఒరనిండా, చేతిలో, కత్తులుంచుకుని తిరిగే సైనికుల రక్షణలో వున్న ఈ పట్టణాన్ని బలంతో గెలవడం ఎవరికీ సాధ్యం కాదేమో ననుకుంటాడు హనుమంతుడు. అయితే, అంగదుడు, ద్వివిదు డు, సుగ్రీవుడు, మైందుడు, సుషేణుడు, రుక్షుడు, కుముడు, కుషపర్వుడు, కేతుమాలుడు మాత్రం లంకలో ప్రవేశించగలరను కుంటాడు.
ఈ ప్రకారం, లంకలోకి రాగల బలవంతులగు వానరులను లెక్కపెట్టి, రామలక్ష్మణుల బలపరాక్రమాలను ఆలోచించి, భయ పడాల్సిన పనిలేదు, వారు వస్తే విజయం కలుగుతుందని సంతోష పడ్తాడు. ఇలా ఆలోచిస్తూ మరీమరీ సమీపంలోకి వెళతాడు హనుమంతుడు. అలా వెళుతున్న అతడికి, రావణుడి పట్టణం, మణు లనే దుస్తులు కప్పుకొన్నట్లుగా, పశువుల కొట్టంలాంటి శిరోభూష ణాలు కలదిగా, యంత్రశాలను పోలిన స్తనాలున్నట్లుగా, అలంకరించుకున్న స్త్రీలాగా కనిపించింది. ఆయన ఇలా లంకను గురించి అనుకుంటుండగానే లంక స్త్రీ రానే వచ్చింది.
లంకానగరంలో ప్రవేశిస్తున్న కోతిని లంకాదిదేవత లంఖిని తన సహజ రూపంతో చూసింది. అదే సమయంలో ఆమెనూ చూసాడు హనుమంతుడు. తక్షణమే కోపంతో వూగిపోతూ అసహ్యమైన ముఖాన్ని, భయంకరమైన రూపాన్ని, దాల్చిన ”లంక” హనుమంతుడికి అడ్డంగా నిల్చి గర్జిస్తూ, ”నువ్వెవరివి? ఎందుకొచ్చావు? నీవు చావక ముందే చెప్పు” అని ప్రశ్నించింది. ఎల్లవేళల, అన్ని ప్రదేశాలలో, రావణుడి సేనలతో రక్షించబడు తున్న లంకా నగరంలోకి దేవతలే ప్రవేశించలేనప్పుడు ప్రవేశిం చినా బ్రతకలేనప్పుడు, హనుమంతుడేలా రాగలిగాడని నిలదీ స్తుంది. ”సరే నా సంగతి తర్వాత చెప్తాను. వికారపు కన్నులతో, లంకా నగర వాకిట్లో వున్న నీవెవ్వరవు? ఇక్కడెందుకున్నావు? నాకెందుకు అడ్డుపడ్తున్నావు? ఊరంటూ వుంటే ఎవరో ఒకరు రాకుండా వుండరు కదా!” అని ఎదురు ప్రశ్న వేస్తాడు ఆంజనేయు డు. ఆ మాటలు విన్న ”లంక” మండిపడి, మారుతిని చూసి కోపంతో, భయంకరంగా మాట్లాడడం మొదలెట్టిందీవిధంగా:
”రావణాసురుడి ఆజ్ఞను శిరసావహించి, ఈ పట్టణాన్ని ఎల్ల వేళలా రక్షిస్తున్నాను. నా కళ్లు కప్పి నువ్విందులోకి రాలేవు. అది సాధ్యపడే విషయం కాదు. ఓ కోతీ, నువ్విప్పుడే చస్తావు. నేనే లంకనురా! ఇది నాసంగతి. మరి నువ్వెవరివో చెప్పు.”
”లంకిణి” మాటలకు ఏమాత్రం అధైర్యపడలేదు హనుమంతుడు. స్త్రీ ఆకారంలో వున్న ఆమెను చూస్తూ, ఏమాత్రం సందే హించకుండా, లంకను చూడాలన్న కోరికతో వచ్చానని చెప్పాడు. తనను గెలవకుండా ద్రోహ బుద్ధిగల హనుమంతుడు రావణుడు రక్షించే లంకా నగరంలోకి ఎట్లా పోతాడో చూస్తానని కఠినంగా అంటుంది లంకిణి. ఏదేమైనా తాను లంకను చూసి శీఘ్రంగా వచ్చిన దారిలోనే పోతానన్న #హనుమంతుడిపై మండిపడుతూ, భయంకరమైన ధ్వని చేస్తూ, అరచేత్తో ఆయన్ను కొడుతుంది. దెబ్బతిన్న మారుతి, కేకపెడ్తూ ఆడదానిపై తన ప్రతాపం ఎందుకు చూపాలని అనుకుంటూ పెద్దగా కోప్పడక, తన ఎడమచేతి పిడికి లితో లంకిణిని పొడుస్తాడు.
ఆమాత్రం పిడికిటి పోటుకే, లంకిణి నోరు తెరుచుకుని, నేల మీద పడిపోయింది. హనుమంతుడు దాన్ని జాలి గా, దయతో చూశాడు. లంకిణి గర్వమణిగి #హను మం తుడితో: ”వానరేంద్రా! నన్ను రక్షించు. నామీద దయ చూపు. నువ్వు చాలా పరాక్రమవంతుడవు. బలవంతులు స్త్రీలను చంపరాదన్న నీతికి కట్టుబ డ్తారు. నేనే ”లంకిణి”ని. యుద్ధంలో సాహసంతో, బలపరాక్రమాలతో, నన్నే గెలిచావు. నీకు రాక్షసులు ఇక అడ్డమా? లంకా నగర ప్రతిష్ఠ సమయంలో నాకు బ్రహ్మదేవుడు వరమిస్తూ, సీతాదేవిని వెతికేందుకు వచ్చే కోతి నిన్నెప్పుడు గెలుస్తాడో, అప్పు డే లంక నాశనమౌతుందని చెప్పాడు” అంటుంది.
తాను సత్యం చెప్తున్నాననీ, బ్రహ్మ దేవుడు యదార్ధం చెప్పా డనీ, ఆయన మాటలు తప్పు కావనీ, సీతాదేవి కారణాన రాక్షసుల కు, రావణుడికి చావు మూడిందనీ, హనుమంతుడు నగరంలోకి పోయి పట్టణమంతా కలియ తిరిగి, తన ఇష్ఠ ప్రకారం చేయదల్చు కున్న పనులన్నీ చేయవచ్చని చెప్తుంది లంకిణి. పతివ్రతల శాపానికి గురైన లంకలోకి ప్రవేశించి సీతను చూసేందుకు కోరిక తీరేవరకు సుఖంగా లంకలో తిరగమని కూడా సలహా ఇస్తుంది.
లంకలో ప్రవేశిస్తున్న #హనుమంతుడికీ, అడ్డు తగిలిన లంకిణి కీ, యుద్ధం జరుగుతున్నప్పుడు, వారు కొట్టుకున్నప్పుడు, ఆ కేక లు వూళ్లో వున్న రాక్షసులకు ఎందుకు తెలియలేదని సందేహం రావచ్చు. గ్రామదేవతల గుళ్లు ఊరిబయట వుంటాయి. వూళ్లోకి రావటానికి వీల్లేని వ్యక్తులను, పొలిమేర దాటకుండా చేసేటందుకే వీరు అక్కడ కాపలా కాస్తుంటారని శాస్త్రం చెప్తున్నది. లంకిణికి, హనుమకు మధ్య జరిగిన గొడవ వూరి బయట జరిగింది. అదీ రాత్రివేళ. వూళ్లోవారి అరుపుల మధ్య ఇవి వినపడే అవకాశంలేదు. ఇకపోతే, హనుమంతుడు చెప్పక పోయినప్పటికీ, బ్రహ్మదేవుడి మాటలను గుర్తుచేసుకున్న లంకిణి, హనుమంతుడు సీతాదేవి కొరకే వచ్చాడని నిర్ధారించుకుంటుంది. ”లం” అనేది పృధివీ బీజాక్షరం. కాబట్టి పృధివీ తత్వాన్ని తెలుపుతున్నది. అది కలది ”లంక”. లంకంటేనే ”దేహం”. హనుమంతుడు లంకను జయిం చాడంటే, తనలోని ఆత్మను వెతికే వాడు, మొదట దేహాన్ని జయిం చాలన్న అర్ధం స్ఫురిస్తున్నది. దేహాన్ని జయించనివాడికి ఆత్మావ లోకనం జరగదు.
(వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement