Saturday, May 18, 2024

పాపము ప్రాయశ్చిత్తము!

‘అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు.’ మతిమరపు వల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసినా పాపం పాపమే. దానిని పోగొట్టుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. మిక్కిలి కోపిష్ఠుడైన కౌశికునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాటను నొక్కి చెప్పాడు.

”మది మఱపున బాపము దన
కొదవుటయును బిదప వగచి యొక
సగమును నేనిది సేయనింక ననియెడు మదిఁ
బెఱ సగమును నరుఁడు మలుఁగు నఘంబున్‌”


మహాభారతం (అరణ్య పర్వం: 5-41) తెలియకుండా చేసిన పొరపాటు-ను తలచుకొని బాధపడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టు-బాటు-ను పాటిస్తే మిగతా సగ పాపం తొలగిపోతుంది. ఏదైనా పాపంగానీ, నేరంగానీ తెలియ కుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం.
‘తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటు-ను తెలుసు కొని, ఇక ముందెప్పుడూ దానిని చేయకూడదని నిర్ణయించు కొని బాధపడటమే’ పశ్చాత్తాపమని మన సనాతన ధర్మం
చెపుతున్నది. అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నాన్నే ‘ప్రాయశ్చిత్తము’ అని అంటారు. ప్రతి మనిషీ మనసా వాచా కర్మణా ఎప్పడూ ఏ తప్పులనూ చేయ కుండా ఉండాలి. ఏ తప్పు-కై-నా ఆ పాపం ఊరికేపోదు. ఒకవేళ ఏవైనా పొరపాట్లు- అనుకోకుండానో, పరధ్యానంలోనో చేసినా వాటికి పరిహారం గా ఆ పాపప్రాయ శ్చిత్తం చేస్తుండాలి. అప్పు డే, ఆ పాపం తొలగిపోతుంది. ‘కొన్ని సందర్భాల్లో అను కోకుండా చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచ లవుతుందని’ పురాణాలు చెపుతున్నాయి. దానినే ‘మన:ప్రా యశ్చిత్త’మని అంటారు.
”పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్‌
ఆచార్యస్యచ సర్వదా
తేషుహి త్రిషు తృప్తేషు
తపస్సర్వం సమాప్యతే”
‘తల్లి, తండ్రి మాటను గానీ, గురువు మాటను గానీ జవ దాటకుండా ఎప్పుడూ వారికి అనుకూలంగా నడుచుకోవాలి. ఈ ముగ్గురూ తృప్తిపడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిద్ధిస్తుంది’. తల్లిదండ్రులను బాధపెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్కృతి లేదు. ఎప్పుడైనా గురువు మాట ను ధిక్కరించి మాట్లాడితే, ఆ పాపం సదరు గురువును విన య విధేయతలతో ఆహ్వానించి, ఉపాహారాన్ని సమర్పించు కొని సంతోష పెట్టడం ద్వారా తొలగింపజేసుకోవచ్చు. కొట్టి వేయకూడని చెట్టు-ను నరికి వేయడం, స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించడం వంటివీ మహాపాప హేతువులే. ఐతే, అనుకోకుండా చేసే పాపాలు ‘అన్నపానీయా లను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ నియ మనిష్ఠలతో జీవితాన్ని గడపడం ద్వారా’ నశిస్తాయి.
దైవసన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగి లించిన పాపం వల్ల గుడ్డివాళ్లయి పోతారు. గుడిపైనగానీ, రథంపైగానీ, పర్వతంపైగానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది. చేసిన పాపాలకు పరిహారంగా ఇలాంటి శిక్షలు ధర్మశాస్త్రాలలో చెప్పడమనేది మనం అలాంటి పాపాలకు పాల్పడకూడదనే.
ఇతరులను బాధపెట్టడమనేదే మహాపాపం. అలాంటి పాపాలకు ఏమాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా జీవించ గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.

సర్వేజనా: సుఖినోభవన్తు!
– పుల్లాభొట్ల భాస్కరశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement