Friday, May 17, 2024

Top 5 cars | 2024లో మార్కెట్‌లోకి రానున్న టాప్‌ 5 కార్లు ఇవే !

దేశంలో కార్ల అమ్మకాలు ప్రతి నెల గణనీయంగా పెరుగుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా ఉండడంతో కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కార్ల కంపెనీలు కూడా పోటీ పడి ఆధునిక కార్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నాయి. 2024లో మన దేశ
మార్కెట్లలోకి ప్రధానమైన కంపెనీలు పెద్ద సంఖ్యలో కార్లను తీసుకురానున్నాయి. ఇలా వస్తున్న వాటిలో పెట్రోల్‌, డీజిల్‌ కార్లతో పాటు ఎలక్ట్రిక్‌ కార్లు కూడా ఉన్నాయి..

- Advertisement -

హ్యుండాయ్‌ క్రిటా..

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హ్యుండాయ్‌ కంపెనీ క్రిటా ఎస్‌యూవీ కారు ఆధునీకరించిన వెర్షన్‌ను 2024 ప్రారంభంలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ కారును ఇప్పటికే రోడ్లపై పరీక్షించారు. కొత్త క్రిటాలో డిజైన్‌, ఇంటిరియర్‌, ఫీచర్ల విషయంలో గణనీయమైన మార్పులు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో డ్యూయల్‌ స్క్రీన్‌ సెటప్‌తో పాటు, పూర్తి బ్లాక్‌ ఇంటిరియర్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌, టెయిల్‌ ల్యాంప్స్‌తో తీసుకు వస్తున్నారు.

మహీంద్రా 5 డోర్‌ థార్‌…

మహీంద్రా అండ్‌ మహీంద్రాకు చెందిన పాపులర్‌ కారు థార్‌లో కంపెనీ 5 డోర్స్‌తో తీసుకురానుంది. మెరుగుపరిచిన థార్‌లో అనేక కొత్త ఫీచర్లను తీసుకు వస్తున్నారు. ఇన్ఫోటైన్మెంట్‌ను మెరుగుపరుస్తున్నారు. గ్రిల్‌ డిజైన్‌లో మార్పులు చేస్తున్నారు. కొత్త అలయ్‌ వీల్స్‌, పెద్ద వీల్‌ బేస్‌, రెండో వరసలో కూర్చునే వారికి మరింత లెగ్‌ స్పేస్‌ ఉండేలా మార్పులు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. థార్‌ పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్స్‌లో లభించనుంది.

టాటా హరియర్‌ ఈవీ…

టాటా కంపెనీ వరసగా ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా హరియర్‌ను 2024 మధ్యలో మార్కెట్లోకి తీసుకు రావాలని ప్లాన్‌ చేసింది. 2023లో జరిగిన ఆటో ఎక్స్‌ఫోలో దీన్ని కంపెనీ ప్రదర్శించింది. ఈ కారు డ్యుయల్‌ మోటార్‌ కానిఫిగరేషన్‌తో రానుంది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్‌తో 500 కి.మీకు పైగా ప్రయాణించనుంది. ఇక నుంచి టాటా నుంచి వచ్చే ప్రతి ఈవీ 500 కి.మీ, రేంజ్‌కి పైగా ఇస్తాయని ఇటీవలే కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రకటించారు. దీంతో పాటు టాటా కంపెనీ కర్వ్‌ పేరుతో మరో ఎలక్ట్రిక్‌ కారును కూడా తీసుకు రానుంది. ఇది లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారు. ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను జోడిస్తున్నారు. పూర్తిగా కొత్త డిజైన్‌ తీసుకు వస్తున్నారు. ఇందులో స్లోపింగ్‌ రూప్‌ ఉండనుంది.

కియా ఇండియా వచ్చే సంవత్సరం మరో విద్యుత్‌ కారు కియా ఈవీ9ను తీసుకు రానుంది. ఈ కారు డిజైన్‌ మరో స్థాయిలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఈ కారు రెండు వేరియంట్స్‌లో లభించనుంది. ఈ కారు 540 కి.మీకు పైగా రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారును 2024 మధ్యనాటికి ఇండియన్‌ మార్కెట్‌లోకి రానుంది. వీటితో పాటు, మారుతీ సుజుకీ కూడా 2024-25 నాటికి ఎలక్ట్రిక్‌ కారును తీసుకు రానున్నట్లు ప్రకటించింది.

భారీగా ఫెస్టివల్‌ డిమాండ్‌…

ప్యాసింజర్‌ వాహనాల హోల్‌ సేల్‌ విక్రయాలు అక్టోబర్‌లో భారీగా నమోదయ్యాయి. కంపెనీల నుంచి డీలర్లకు డిస్పాచ్‌ అయిన వాహనాలు ఈ అక్టోబర్‌లో 16 శాతం ఎక్కువగా ఉన్నాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యూఫాక్చరర్స్‌ (ఎస్‌ఐఏఎం-సైమా) తెలిపింది. గత సంవత్సరం అక్టోబర్‌లో 3,36,330 వాహనాలు డిస్పాచ్‌ అయితే ఈ సారి ఈ సంఖ్య 3,89,714గా ఉందని సైమా అధ్యక్షుడు వినోద్‌ అగర్వాల్‌ శుక్రవారం నాడు చెప్పారు.

త్రీ వీలర్స్‌ డిస్పాచ్‌లు 42 శాతం పెరిగి 76,940గా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 54,154 యూనిట్లుగా ఉన్నాయి. పండుగ సీజన్‌ కావడం వల్ల ఈసారి వాహనాల డిస్పాచ్‌లు భారీగా ఉన్నాయని వినోద్‌ అగర్వాల్‌ చెప్పారు. అక్టోబర్‌లో మొత్తం టూ వీలర్స్‌ అమ్మకాలు 18,95,799 యూనిట్లుగా ఉన్నాయి. గ త సంవత్సరం ఇదే కాలంలో అమ్మకాలు 15,78,383 యూనిట్లతో పోల్చితే ఈ సారి 20 శాతం వృద్ధి నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement