Friday, April 26, 2024

కీలక వడ్డీ రేట్లు యథాతథం

భారతీయ రిజర్వు బ్యాంకు పరపతి సమీక్షలో మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది‌. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. కరోనా ఉద్ధృతి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4శాతంగా ఉంచగా.. రివర్స్‌ రెపో రేటు 3.35శాతంగా ఉన్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ఇక కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కాస్త నెమ్మదించింది. దీంతో ఈసారి కూడా సర్దుబాటు విధాన వైఖరినే కొనసాగించనున్నట్లు దాస్‌ వెల్లడించారు.

ఆర్‌బీఐ సమీక్షలోని ముఖ్యాంశాలు:

✪ 2021-22 ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను 10.5శాతం నుంచి 9.5శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలను కూడా 26.2శాతం నుంచి 18.5శాతానికి సవరించింది.
✪ ఈ ఏడాది సగటు వర్షాపాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది
✪ 2021- 22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.1శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 5.2శాతం, రెండో త్రైమాసికంలో 5.4శాతం ఉండొచ్చని తెలిపింది
✪ ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహకారం అందించడం కోసం రూ. 16వేల కోట్ల ద్రవ్యాన్ని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐడీబీఐ)కి ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
✪ జీ-శాప్‌ 2.0 కింద జూన్‌ 17న రూ. 40వేల కోట్ల విలువైన సెక్యూరిటీస్‌ కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
✪ ఇకపై గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు కూడా డిపాజిట్ల సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అనుమతి కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement