Friday, May 3, 2024

జీఎస్టీ వసూళ్లు 1.51 కోట్లు.. గత ఏడాది కంటే 16.6 శాతం అధికం

దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. అక్టోబర్‌ నెలలో ఇవి 1,151,718 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. గత సంవత్సరంతో పోల్చితే వసూళ్లు 16.6 శాతం పెరిగాయి. వీటిలో సీజీఎస్టీ కింద 26,039 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద 33,396 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఐజీఎస్టీ కింద 81,778 కోట్లు సమకూరాయి. సెస్సుల రూపంలో 10,505 కోట్లు వసూలైనట్లు పేర్కొంది.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. ఆ నెలలో 1.67 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలయ్యాయి. మళ్లి రెండో సారి ప్రస్తుతం అక్టోబర్‌ నెలలో రికార్డ్‌ స్థాయిలో 1.50 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఇలా వరసగా 1.4 లక్షలకుపైగా జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం ఇది వరసగా 8వ నెల. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఇది 9వ సారి.

ఏపీలో 24, తెలంగాణలో 11 శాతం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో 2,879 కోట్లు వసూలు కాగా, ఈ సారి 3,579 కోట్లు వసూలైయ్యాయి. గత ఏడాదితో పోల్చితే వసూళ్లలో 24 శాతం వృద్ధి నమోదైంది. తెలంగాణలో ఈ సంవత్సరం అక్టోబర్‌లో 4,284 కోట్లు వసూళ్లు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 3,854 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం వసూళ్లు 11 శాతం పెరిగాయి. రాష్ట్రాల వారిగా వసూళ్లు చూస్తే మహారాష్ట్ర ముందుంది. గత సంవత్సరం తో పోల్చితే ఈ ఏడాది 19 శాతం వృద్ధితో 23,037 కోట్లు వసూలైయ్యాయి. గత ఏడాది ఇవి 19,355 కోట్లుగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement