Saturday, May 18, 2024

2000 నోట్ల నుంచి ఆధార్‌ అప్డేషన్‌ వరకు.. సెప్టెంబర్‌లో ఆర్థికపర మార్పులివే..

ప్రతినెలా ఆర్థికపరమైన అంశాలలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటుంటాయి. సెప్టెంబర్‌లోనూ ఇలాంటి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొన్ని మొదటి తారీఖు నుంచే అమలవుతుంగా, మరికొన్ని మార్పులు కొద్దిరోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపే కీలక మార్పులు సెప్టెంబర్‌లో చోటుచేసుకుంటున్నాయి.

మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లు నామినీని ఎంచుకోవడానికి గడువు ఈనెలతో ముగియనుంది. కొన్ని బ్యాంకులు తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో మదుపు చేసేందుకూ సెప్టెంబరే చివరి నెల. ఇలా సెప్టెంబరు నెలలో ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు కీలక మార్పులేంటో చూద్దాం.

- Advertisement -

  • రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ మే 19న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది.
  • 2022 అక్టోబర్‌ 1 తర్వాత ఫోలియో జనరేట్‌ అయిన కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లకు నామినీ ఎంచుకోవడమో లేదా వద్దనుకుంటున్నట్లో ధ్రువీకరించాలి. అంతకంటే ముందు నుంచి ఫండ్లలో మదుపు చేస్తున్నవారు నామినీని ఎంచుకోవడంగానీ లేదా వద్దనుకుంటున్నామనిగానీ ధ్రువీకరణ సమర్పించాలి. దీనికి సెప్టెంబరు 30 తుది గడువు. తర్వాత ధ్రువీకరణ సమర్పించనివారి ఖాతాల్లో నిర్వహణ నిలిచిపోతుంది. స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లకు సైతం ఇది వర్తిస్తుంది. లేదంటే డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు నిలిచిపోతాయి.
  • మే 2022 నుంచి ఆర్‌బీఐ రెపోరేటు పెంచింది. దీంతో బ్యాంకులు ఫిక్స్‌ డిపాజిట్‌ వడ్డీరేట్లను సైతం అందుకు అనుగుణంగా సవరించాయి. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు అధిక వడ్డీరేట్లతో ప్రత్యేక డిపాజిట్‌ పథకాలను తీసుకొచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి వచ్చిన అమృత్‌ మహాత్సవ్‌ ఎఫ్‌డీ సెప్టెంబరు 30తో ముగియనున్నది. దీంట్లో సీనియర్‌ సిటిజెన్స్‌కు 7.60 శాతం, ఇతరుకు 7.1 శాతం వడ్డీరేటు ఆఫర్‌ చేస్తున్నారు. అలాగే ఎస్‌బీఐ వీకేర్‌ ఎఫ్‌డీ ద్వారా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలపరిమితితో చేసే డిపాజిట్లకు సీనియర్‌ సిటిజెన్స్‌ 50 బేసిస్‌ పాయింట్ల అధిక వడ్డీరేటును పొందొచ్చు. దీనికి కూడా సెప్టెంబరుతో గడువు ముగుస్తుంది.
  • కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఇండియా పోస్ట్‌ మే నెలలో తమ ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆధార్‌ వివరాలు ఇవ్వనివారు సెప్టెంబరు 30 కల్లా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. అలాగే పాన్‌ వివరాల సమర్పణకు కొన్ని నిబంధనలు విధించింది. ఖాతాలో ఉన్న డిపాజిట్‌ మొత్తం రూ.50 వేలు దాటినాబీ ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల మొత్తం విలువ రూ.1 లక్ష మించినా, ఒక నెలలో బదిలీ లేదా ఉపసం#హరణ మొత్తం రూ.10 వేలు దాటినా.. ఈ మూడు సందర్భాల్లో రెండు నెలల్లోగా పాన్‌ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.
  • ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు సెప్టెంబరు 14తో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ మార్చి 15 నుంచి ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును ఇప్పటికే అనేక మార్లు పొడిగించింది. ఆధార్‌ కార్డులో చిరునామా మార్చుకోవాలనుకునేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవాలి. లేదంటే గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement