Friday, April 26, 2024

తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం

తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని వెల్లడించారు.

ధర్మప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కశ్మీర్‌లో 62 ఎకరాల్లో టీటీడీ నిర్మిస్తున్న ఆలయాన్ని 18 నెలల్లో నిర్మిస్తామని చెప్పారు. త్వరలోనే ముంబై, వారణాసిలో కూడా ఆలయాల నిర్మాణం చేపడతామని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. స్వామివారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పిస్తున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

హనుమంతుడి జన్మస్థలం తిరుమలగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆకాశగంగ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేశామన్నారు. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగిస్తామన్నారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీని ఏర్పాటు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement