Friday, May 3, 2024

Youngest CM – సిఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న‌ జ‌గ‌న్ …

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలోనే అతి పిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఒకరిగా ఉన్న ముఖ్య మంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలోనూ కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్‌ నిధులను తీసుకురావడంలోనూ అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు. 2019 మే 30వ తేదీ ఆంధ్రప్రదేశ్‌ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మంగళవారంతో నాలుగే ళ్ల పాలనను పూర్తిచేసుకుని ఐదో సంవత్సరంలోని విజయవంతంగా అడుగిడబోతున్నారు. గడచిన నాలుగేళ్లలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 98.5 శాతం ఆచరణలో అమలుచేసి చూపించి సరికొత్త చరిత్ర ను ఆయన సృష్టించారు. ఇచ్చిన హామీలతోపాటు ఆయా ప్రాంతాల్లో అవసరమైన ప్రతి అంశానికి సంబంధించి పరిష్కారం కోసం మరికొన్ని పథకా లను తెరమీదకు తీసుకొచ్చి లోటు బడ్జెట్‌లోనూ ప్రజలకు నూటికి నూరు శాతం అమలుచేస్తూ రాష్ట్రంలోని పేద ప్రజల మన్ననలు పొందుతున్నా రు. సంక్షేమ పథకాలతోపాటు ఆయా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పాలనా పరంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని వివాదంగా మారినప్పటికీ విజయం సాధి స్తూ సీఎం జగన్ ప్రజలకోసం వేగంగా ముందడుగు వేస్తున్నారు. అలాగే పేద ప్రజలకు అవసరమైన పథకాలతోపాటు విద్య, వైద్య రంగానికి సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు.

పై రెండు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడంతోపాటు వేల కోట్ల నిధులను వెచ్చించి సర్కారు బడులను కార్పొరేట్‌ సాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైద్య శాలలను కూడా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పేద ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే విలేజ్‌ క్లీనిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్‌సెప్ట్‌ను తీసుకొచ్చారు. అదేవిధంగా రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న తొమ్మిది రంగాలను బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పటిష్టతకు బలమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ జీవనడాడి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుండి తీసుకొచ్చేందుకు గడచిన నాలుగేళ్లుగా సీఎం జగన్‌ గట్టి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఫలితంగానే పోలవరం పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా సాగు నీటి పథకాలను పైలట్‌ ప్రాజెక్టు కిందకు తీసుకొచ్చి వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంక్షేమమే అజెండాగా
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ప్రస్తుత ఐదేళ్ల పదవీ కాలంలోని చివరి ఏడాదిలోకి నేడు ప్రవేశించబోతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని క్లీన్‌ స్వీప్‌ చేయడంలో సహాయపడేందుకు తన నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాల గురించి ప్రతి సభలోనూ హైలైట్‌ చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం నెరవేర్చిందన్న విషయాన్ని కూడా ఆయన పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ‘ఇచ్చిన హామీలను నెరవేర్చామని, భగవంతుని దయతో, మీ అందరి ఆశీస్సులతో నాలుగేళ్ల క్రితం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, మీకు సేవ చేసేందుకు మీరు ఇచ్చిన బాధ్యతను అవకాశంగా భావిస్తున్నామ’ని సీఎం టీ-్వట్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేశాం.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 175 సీట్లు- గెలుచుకుని మళ్లీ మీకు సేవ చేసే అవకాశం వచ్చేలా చర్యలు తీసుకుంటు-న్నామంటూ కూడా ఆట్వీట్‌లో పేర్కొనడం విశేషం.

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 50 శాతానికి పైగా ఓట్లతో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. ఇది గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌ మోహన్‌ రెడ్డి బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో కూడా తన సంక్షేమ పథకాల అమలు పరంపరను యథావిధిగా కొనసాగించారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలలో 98.5 శాతం అమలు చేసి గత నాలుగేళ్లలో రికార్డు సృష్టించారు. వచ్చే మే వరకు కొనసాగనున్న తన పదవీకాలంలో సీఎం జగన్‌ నవరత్నాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన దృష్టి సారిస్తున్నారు.

పెట్టుబడులు రాబట్టడంలో సక్సెస్‌
అభివృద్ధిలో ఏపీ ముందంజలో నిలుస్తోంది. గత మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈక్రమంలోనే గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ ద్వారా రూ.13.5 లక్షల కోట్ల పెట్టు-బడులను పొందడంలో సీఎం జగన్‌ విజయం సాధించారు. ఇది 6 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుంది. 2018-19లో 3.2 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధిని 12.8 శాతానికి అంటే నాలుగు రెట్లు- పెంచుతూ ఈ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. అందరికీ విద్య, మహిళలకు సాధికారత, సామాజిక న్యాయం, నవరత్నాలు నినాదంతో సామాజిక ఇంజనీరింగ్‌ ద్వారా అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో సీఎం జగన్‌ పరిపూర్ణంగా విజయం సాధించారు. ప్రజల మద్దతును పొందేందుకు సంక్షేమం, అభివృద్ధి అనే ఆయుధాలతో వైఎస్సార్‌సీపీ 2024 ఎన్నికల కురుక్షేత్ర పోరులోకి దూసుకుపోతోందని ఆయన పాలన ద్వారా స్పష్టమౌతుంది.

- Advertisement -

వివక్షకు తావు లేకుండా
అన్ని వర్గాల ప్రజలు వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. కరోనా సంక్షోభం కూడా ఏ పథకాన్ని ప్రభావితం చేయలేదు. దేశంలో మరెక్కడా 47 నెలల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ- (డైరెక్ట్‌ క్యాష్‌ ట్రాన్స్‌ఫర్‌) రూపంలో 2.10 లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసిన దాఖలాలు లేవు. నాడు-నేడు పథకం కార్పొరేట్‌ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలను మెరుగ్గా మార్చింది. బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టింది. ఇంకా, నాడు-నేడు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడానికి దోహదపడింది. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు- చేస్తున్నారు. ఇది వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుకు నాందీ పలికింది.

వికేంద్రీకరణకు పెద్ద పీట
ప్రభుత్వ పరిపాలనలో వికేంద్రీకరణకు పెద్ద పీట వేశారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణ నినాదాలు మొదట్లో కొంత వ్యతిరేకతను తెచ్చిపెట్టినా ఇప్పుడవే ప్రభుత్వానికి వన్నె తెచ్చి పెడుతున్నాయి. ఇందులో పెద్ద విప్లవం గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు- చేయడం. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకు తీసుకురావడం. అలాగే, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దాని కింద 26 జిల్లాలు ఏర్పాటు- జరిగింది. పరిపాలన వికేంద్రీకరించబడింది. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ది చేయాలన్న దూర దృష్టితో ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుండి మద్దతు క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. వృద్ధుల పింఛన్‌ను రూ.2000 నుంచి రూ.2250కి పెంచడం కోసం సంక్షేమ పింఛన్‌ ఫైలుపై తొలి సంతకం పెట్టి సీఎం జగన్‌ తన ప్రభుత్వం ఏర్పా-టైన తొలిరోజును ప్రారంభించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఈసందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఇది ఇప్పుడు రూ. 2,750కి పెరిగిందని, జనవరి 2024 నుండి రూ. 3,000కి పెంచడం జరుగుతుందని వారు విస్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు- చేసిన గ్రామ వార్డు సచివాలయాల వద్ద వేలాది మంది వాలంటీ-ర్ల సహకారంతో జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వ పథకాలు దశలవారీగా, పారదర్శకంగా విజయవంతంగా అమలులోకి రావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement